‘నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రూ.820కోట్లతో నియోజకవర్గం అంతటా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సాగర్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. గతంలో ఇక్కడి నుంచి ఏడెనిమిది సార్లు గెలిచి మంత్రులు, పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వారు దశాబ్దాలుగా చెయ్యలేని పనులను యువ ఎమ్మెల్యే నోముల భగత్ నేతృత్వంలో జరుగుతున్నాయన్నారు. గతానికి, ఇప్పటికీ తేడాను గమనించాలని, అభివృద్ధిలో సాగర్ నియోజకవర్గానికి, ఎమ్మెల్యే భగత్కు తామంతా అండగా ఉంటామని ప్రకటించారు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్కు కుడిభుజంగా, ఆత్మీయ సోదరుడిగా కొనసాగుతున్న జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి పర్యవేక్షణలో నెల్లికల్లు లిఫ్ట్ పనులతోపాటు సాగర్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని పేర్కొన్నారు. శనివారం హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు సంబంధించిన రూ.56కోట్ల అభివృద్ధి పనులకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్, రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు సుంకిశాల వద్ద హైదరాబాద్ మెట్రో వాటర్ పంప్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
నాగార్జునసాగర్ హిల్కాలనీలోని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రం బుద్ధవనాన్ని ప్రారంభించారు. అనంతరం హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
నల్లగొండ ప్రతినిధి, మే 14(నమస్తే తెలంగాణ), హాలియా : నాగార్జునసాగర్ ఉపఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, రూ.820 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. శనివారం హాలియాలో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఎంసీ కోటిరెడ్డిని ఎమ్మెల్సీ చేసుకున్నామని, డిగ్రీ కాలేజీని ప్రారంభించుకున్నామని, ఇక మిగిలిన అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రూ.670కోట్లతో నెల్లికల్లు ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్ మాట ప్రకారం మిగిలిన ఆయకట్టుకు సాగునీరిచ్చి సస్యశ్యామలం చేస్తామన్నారు. దాంతో పాటు కొత్తగా మినీ స్టేడియం కోసం రూ.3.70 కోట్లను, ఓపెన్ డ్రెయిన్ సమస్య పరిష్కారం కోసం మరో 15కోట్ల రూపాయలను సైతం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సాగర్ నుంచి ప్రాతినిథ్యం వహించిన జానారెడ్డి… సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసినా జిల్లా అభివృద్ధి కోసం చేసిందేమీ లేదన్నారు. పక్కనే కృష్ణానది పారుతున్నా… కడివెడు నీళ్లు ఇవ్వలేక జిల్లా ప్రజలను ఫ్లోరోసిస్తో జీవచ్ఛవాలుగా మార్చిన అసమర్ధ నాయకులు కాంగ్రెస్ నేతలని మండిపడ్డారు. ఆరేడు దశాబ్దాలుగా అధికారంలో ఉండి కూడా నల్లగొండ జిల్లాకు ఏమీ చేయలేదని, పైగా ఉద్యమ సమయంలో అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఒక్క మాటతోనే నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే 40 తండాలను పంచాయతీలుగా చేశారని, కలలో కూడా ఊహించని విధంగా హాలియా, నందికొండ మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు.
రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం
రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెండ్ల మాదిరిగా జోడించి ముందుకు తీసుకుపోతున్నామని వివరించారు. గతంలో ఆరడుగుల ఆజానుబావులు మంత్రులుగా ఉన్న ఆరు గంటలకు మించి వ్యవసాయానికి కరెంటు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో 24 గంటలపాటు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. కాంగ్రెస్ నేతలు సమర్ధులే అయితే… ఎందుకు ఫ్లోరోసిస్ను తరిమేయలేదు… ఎందుకు కరెంటు, రైతుబంధు, రైతు బీమా, ఆసరా ఇవ్వలేదు… ఎందుకు నెల్లికల్ లిఫ్ట్ ఇవ్వలేదు అని సూటిగా ప్రశ్నంచారు. ఊపదంపుడు ఉపన్యాసాలు తప్పా కాంగ్రెస్ నేతలకు సమాధానం చెప్పే ధైర్యం లేదని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు వచ్చినట్లు కాంగ్రెస్ నేతలు ఎన్నికలు రాగానే మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అంటూ వస్తారని అన్నారు. ఇలాంటి వాళ్లను అస్సలు విశ్వసించవద్దని, వీరి నాయకత్వాన్ని ఇప్పటికే మీరంతా తిరస్కరించారని గుర్తు చేశారు. సాగర్లో యువకుడు, ఉత్సాహవంతుడైన భగత్ ఎమ్మెల్యేగా ఉన్నాడని, ఆయనకు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం ఉందని, మీరంతా భవిష్యత్తులోనూ ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచించారు. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో నాగార్జునసాగర్ అభివృద్ధికి మేమంతా అండగా ఉంటామని ప్రకటించారు.
రూ.56కోట్లతో పనులకు శ్రీకారం….
ప్రస్తుతం నందికొండ మున్సిపాలిటీలో రూ.8 కోట్లతో సీసీ రోడ్డు డ్రైనేజీ, రూ. కోటితో డిజిటల్ లైబ్రరీ, రూ. కోటితో పైలాన్ కాలనీలో బస్టాండ్, రూ. కోటిన్నరతో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్, రూ.4.50 కోట్లతో ఆడిటోరియం, రూ.9 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు, రూ.2 కోట్లతో ఒకే చోట వెజ్ నాన్వెజ్ మార్కెట్ , రూ.కోటితో వైకుంఠధామం పనులకు శంకుస్థాపన చేశామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అదేవిధంగా హాలియా మున్సిపాలిటిలో కూడా మరో రూ. 28 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, అందులో రోడ్ల విస్తరణ, ఎన్ఎస్పీ లెఫ్ట్ కెనాల్పై రోడ్డు నిర్మాణం, వాకింగ్ ట్రాక్కు రూ.8.50కోట్లు, రూ.75లక్షలతో సీసీ రోడ్డు, లెవలింగ్ గ్రౌండ్కు రూ.75 లక్షలు, స్టేడియానికి రూ.3.75కోట్లు, రూ. నాలుగున్నర కోట్లతో ఎన్ఎస్పీ వద్ద సీసీ రోడ్డు, రూ. 5 కోట్లతో ఆడిటోరియం, రూ. కోటితో డిజిటల్ లైబ్రరీ, నాలుగున్నర కోట్లతో సీసీ రోడ్డు, డ్రైనేజీ, రూ.2 కోట్లతో వెజ్ నాన్వెజ్ మార్కెట్, రూ.కోటితో వైకుంఠధామం పనులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. రెండు మున్సిపాలిటీల్లో మొత్తం రూ.56 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. సాగర్ నియోజకవర్గం నుంచి ఇప్పటికీ ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన జానారెడ్డి ఏడు సార్లలో కలిపి హాలియా, నందికొండ కోసం ఇప్పటివరకు రూ. 56 కోట్లు తేగలిగారా అని ప్రశ్నించారు. యువ ఎమ్మెల్యే భగత్ హాయంలో ఏడాదిలోనే రూ.56 కోట్లు సాధించుకొచ్చాడని వివరించారు.
జగదీశ్రెడ్డికి మంత్రి కేటీఆర్ కితాబు
హాలియాసభలో మంత్రి కేటీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ జిల్లా మంత్రి జగదీశ్రెడ్డికి ప్రత్యేకంగా కితాబిస్తూ ఆకాశానికెత్తారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటి ఉండి నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాను జగదీశ్రెడ్డి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. “ జగదీశన్న మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు ఒక కుడిభుజంగా, తమ్ముడిగా, నల్లగొండ జిల్లాలో గులాబీ జెండా ఎగురవేసిన నాటి నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ వెన్నంటి అనుంగసోదరుడిగా ఉంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధిబాటలో ముందుకు తీసుకుపోతున్నారని” కేటీఆర్ వ్యాఖ్యానించడంతో సభాప్రాంగణం చప్పట్లతో మారుమ్రోగింది.
భారీగా తలివచ్చిన జనం…
మిట్టమధ్యాహ్నం సూర్యుడు ప్రతాపం చూపుతున్నా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రజలు హాలియా బహిరంగసభకు తరలివచ్చారు. ఎండ నేపథ్యంలో సభా ప్రాంగణంలో కూలర్లు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. కాంగ్రెస్ నేతలపై విమర్శలకు, స్థానిక నేత జానారెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేసిన ప్రతిసారి కూడా మంచి స్పందన కనిపించింది. సభా వేదికపై రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ పాడిన పాటలు ప్రజలను ఉత్సాహ పరిచాయి. ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, నల్లమోతు భాస్కర్రావు, రమావత్ రవీంద్రకుమార్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్త, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్నాయక్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, హాలియా, నందికొండ మున్సిపల్ చైర్పర్సన్లు వెంపటి పార్వతమ్మ, కర్ణ అనూషారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే భగత్ నివాసంలో విందు…
బహిరంగ సభ అనంతరం మంత్రి కేటీఆర్ను ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ హాలియాలోని తమ ఇంటికి ఆహ్వానించారు. కేటీఆర్తో పాటు మంత్రులు, ప్రముఖులకు కమ్మని విందు ఏర్పాటు చేశారు.
నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా…
మా నాన్న నోముల నర్సింహయ్య అకాల మరణంతో రాజకీయంగా అనాథగా మిగిలిపోయిన నన్ను, మా కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అక్కున చేర్చుకుని ఆదుకున్నారు. పెద్ద మనసుతో ఆశీర్వదించి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్కు, ప్రేమాభిమానాలతో ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ పెద్దల సహకారంతో ఏడాది కాలంలోనే నియోజకవర్గంలో అనేక సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం.
–నోముల భగత్ కుమార్, ఎమ్మెల్యే