కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న ఆకాంక్షలను నెరవేరుస్తామని రాష్ట్ర ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు
అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు అందరం కలిసి చిత్తశుద్ధితో కృషి చేద్దామని కోరారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కోమటిరెడ్డి తొలిసారిగా సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్18(నమస్తే తెలంగాణ) : మంత్రిగా తొలిసారిగా కలెక్టరేట్కు వచ్చిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, కలెక్టర్ ఆర్.వీ.కర్ణన్, వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం మిషన్ భగీరథ, విద్యుత్, పౌరసరఫరాలు, తదితరల శాఖలపై అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ జిల్లా అధికారులంతా ప్రభు త్వ లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఎన్నికల హామీలో భాగంగా ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీన్ని అమలులో అధికారులదే కీలకపాత్ర అని చెప్పారు. అధికారులకు కూడా తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.
మిషన్ భగీరథ ద్వారా ప్రజలందరికీ సురక్షిత తాగునీరు అందించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు చాలా నమ్మకం ఉందని, వారి ఆశలని నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మిషన్ భగీరథ నీళ్ల సరఫరాపై ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులదేనని స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో అధికారులు సమావేశాలు నిర్వహించి తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. ఇక విద్యుత్ సమస్యలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. కరెంటు సమస్యలపై రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించాలన్నారు. దీనిపై పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు.
సబ్ స్టేషన్ల ఏర్పాటు, విస్తరణ కోసం పిలిచిన టెండర్ల పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతుందని అధికారులను వివరణ కోరారు. విద్యుదాఘాతంతో మరణించిన 32 మందికి పరిహారం చెల్లింపులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలు తీర్చేందుకు కావాల్సిన నిధుల వివరాలు ఇస్తే సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి మంజూరీ చేయిస్తానని చెప్పారు. పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజలకు సరైన సేవలు అందేలా చూడాలన్నారు. పేదల సమస్యలకు పరిష్కారం చూపేలా అన్ని చర్యలు చేపట్టాలని, రేషన్ డీలర్ల పోస్టులు ఖాళీగా ఉండకూడదని చెప్పారు.
అందరం కలిసి సమష్టిగా జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుందూరు జయవీర్రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ ఆర్.వీ.కర్ణన్, అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత్ కేశవ్, శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నీలగిరి : రాష్ట్ర ఆర్అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టి జిల్లాకు తొలిసారిగా వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి సోమవారం కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికాయి. ముందుగా మర్రిగూడ ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ర్యాలీగా నల్లగొండలోని ప్రధాన వీధుల గుండా క్యాంపు కార్యాలయం వరకు సాగింది. ఐటీ టవర్ వద్ద, వీటి కాలనీలో ఆయనకు హెలికాప్టర్ ద్వార పూల వర్షం కురిపించారు.
అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. నల్లగొండలో ప్రతి రోడ్డును అద్భుతంగా తీర్చిదిద్దుతానని అన్నారు. నల్లగొండ ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, తిప్పర్తి, నల్లగొండ జడ్పీటీసీలు పాశం రాంరెడ్డి, వంగూరి లక్ష్మయ్య, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
చిట్యాల : చిట్యాల పట్టణంలోని జాతీయ రహదారిపై రూ.65 కోట్లతో నిర్మించనున్న ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంక్రాంతి పండుగకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మంత్రి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి నల్లగొండకు వెళ్తుండగా చిట్యాలలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి వెంకట్రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ జనవరి 2న టెండర్లు ఖరారు అవుతాయని తెలిపారు. అలాగే ఎంతో కాలంగా పెండింగ్లో ఉండి పలు ప్ర మాదాలకు కారణమవుతున్న చిట్యాల-భువ నగిరి రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా దాదాపు రూ. 400 కోట్లతో విస్తరించే పనికి కూడ జన వరిలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల, పట్టణ పార్టీల అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీనర్సింహ, జడల చిన మల్లయ్య, పోకల దేవదాసు, కాటం వెంకటేశం పాల్గొన్నారు.
నార్కట్పల్లి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ నుంచి నల్లగొండకు వెళ్తూ మార్గ మధ్యలో సోమవారం నార్కట్పల్లిలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వే ముల వీరేశం ఆధ్వర్యంలో గజమాలతో సన్మానించి స్వాగతం పలికారు. మునుగోడు రోడ్డు నుంచి నల్లగొండ బైపాస్ వరకు బైక్ ర్యాలీతో పాల్గొన్నారు.