నల్లగొండ, మార్చి 21 : రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని విత్తన కంపెనీలు మాయమాటలు చెప్పి కొత్త విత్తనాలను అంటగడుతున్నాయి. తీరా పంటలు సాగు చేసిన అన్నదాతకు నాణ్యమైన పంటలు చేతికి రాక గగ్గోలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. తక్కువ కాలంలో నాణ్యమైన పంట చేతికొస్తుందని ఈ యాసంగిలో రైతులు పెద్ద మొత్తంలో మహేంద్ర 606 చింట్లు వేశారు. కానీ పంట చేతికొచ్చాక ధాన్యం నాణ్యత లేకపోవడంతో కొనేందుకు మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు.
దాంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తున్నది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోపాటు అధికారులు రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి ధాన్యం కొనాలని మిల్లర్లకు హెచ్చరికలు జారీ చేసినా ఫలితం ఉండడం లేదు. ఇక్కడ తప్పెవరిది..శిక్షెవరికి అనేది చర్చనీయాంశంగా మారింది. విత్తన కంపెనీల మాటలు విని సాగు చేసిన రైతుదా.. లేదంటే నాణ్యంగా ఉత్పత్తి రాని కంపెనీదా అనేది ప్రశ్నార్థకమైంది. అయితే సుమారు 1.50 లక్షల ఎకరాల్లో సాగు చేసిన మహేంద్ర చింట్లు ప్రస్తుతం మార్కెట్లో రైతులను ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి.
ఐదేండ్లుగా నల్లగొండ, సూర్యాపేటలో మహేంద్ర చింట్లు విత్తనాలు సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాని సమస్య ఈ ఏడాది మాత్రమే వచ్చింది. పైగా క్రాప్ వరకే మా బాధ్యత, మిల్లింగ్ అనేది మాకు సంబంధం లేదు. రైతుకు దిగుబడి రాకుంటే మేము బాధ్యులం అవుతాం. కానీ బియ్యం విషయంలో కాదు. పైగా మిల్లర్లు ఈ సీజన్ ప్రారంభం నుంచి కొని ఇప్పుడు మార్కెట్లోకి సూపర్ ఫైన్ రకం ధాన్యం రావటంతో మా రకం ధాన్యం పక్కన పెడుతున్నారు. ఆలస్యంగా సాగు చేసిన వారి ధాన్యంలో క్వాలిటీ లోపించవచ్చు. కానీ సకాలంలో సాగు చేసిన వారికి మంచి దిగుబడి వచ్చింది.
-చైతన్య, సేల్స్ ఆఫీసర్, మహేంద్ర విత్తన కంపెనీ
నేను మూడు ఎకరాల్లో మహేంద్ర చింట్లు వరి సాగు చేసిన. వంద రోజుల్లోనే పంట చేతికొస్తదని అంటే ఈ సారి వర్షాలు లేవు కదా, తొందరగా చేతికొస్తదని వేసిన. ఇది కోసి మిర్యాలగూడ మిల్లుల్లోకి తీసుకెళ్తే ఏ ఒక్క మిల్లు వారు తీసుకోలేదు. నేను రెండు రోజుల పాటు మిర్యాలగూడ ఏరియాలోని మిల్లుల్లోకి వెళ్లి కొనమంటే ఎవరు కూడా వడ్లు బాగాలేవు కొనము అన్నారు. ఈ విషయం సివిల్ సైప్లె అధికారులకు ఫోన్ చేసి చెప్పినా కనీసం అక్కడకు రాకపోగా ఒక్కసారి ఫోన్ ఎత్తి మళ్లీ ఎత్తలేదు. వడ్లు బాగాలేవు అని కొంటలేరు. ఏం చేయాలో తెలియక వాటిని తీసుకొచ్చి ఇంటి దగ్గర ఎండబోసిన.
-మందడి వెంకట్ రెడ్డి, రైతు, మర్రిగూడ, నల్లగొండ
ఐదు నెలల్లో చేతికి రావాల్సిన వరి పైరు కాలానుగుణంగా మార్కెట్లోకి వచ్చిన కొత్త వంగడాల మూలంగా సన్నాల రూపంలో నాలుగు నెలల్లోనే చేతికొస్తున్నాయి. ఈ వంగడం పచ్చి ధాన్యం అయినా మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో సాగర్ ఆయకట్టుతోపాటు నాన్ ఆయకట్టు రైతులు పెద్ద మొత్తంలో చింట్లు సాగు చేశారు. ఒకటి రెండు కంపెనీలు మాత్రం ఈ సారి కాలం పరిస్థితులను అంచనా వేసి నీటి వనరులు తక్కువగా ఉండడంతో వంద రోజుల్లోనే పంట చేతికొస్తుందని రైతులను బురిడీ కొట్టించాయి. మహేంద్ర 606 వెరైటీ విత్తనాలతో వంద రోజుల్లోనే క్వాలిటీతో పంట చేతికొస్తుందని కంపెనీ ప్రతినిధులు చెప్పగా, చాలా మంది రైతులు వాటిని సాగు చేశారు. ఇతర వెరైటీలు మిల్లింగ్ చేస్తే క్వింటాకు 60 నుంచి 65 కేజీల బియ్యం వస్తుండగా ఈ మహేంద్ర 606 వెరైటీ మిల్లింగ్ చేస్తే 48 నుంచి 51 కేజీల బియ్యమే వస్తున్నాయి. మిగతావి నూకలు అవుతున్నాయి. బియ్యం కూడా లావుగా, తెల్ల బెండు ఉంటున్నది. దాంతో రైతులు మహేంద్ర చింట్లు అమ్మలేక అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో పచ్చి బియ్యం మిల్లింగ్ చేసే మిల్లులు మార్కెట్లోకి వచ్చిన దగ్గర నుంచి మొదట్లో ఆయకట్టులో, ఆ తర్వాత నాన్ ఆయకట్టులో సన్నాల సాగు గణనీయంగా పెరిగింది. ప్రతియేటా వాటి ధర కూడా రైతులు ఆశించిన మేరకే ఉండగా ఈ సారి మాత్రం కొన్ని విత్తన వెరైటీలతోపాటు నీటి కొరత మూలంగా కొంత మేరకు నాణ్యంగా లేవనేది తోసిపుచ్చలేని అంశం. ఈ నేపథ్యంలో నాణ్యత లేని ధాన్యానికి రూ.2వేల నుంచి రూ.2,100 వరకు మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇదే సమయంలో నాణ్యంగా ఉన్న సన్నాలకు మిల్లర్లు మంచి ధర పెట్టి కొనుగోలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రధానంగా చిట్టి పొట్టి, హెచ్ఎంటీ, కావేరీ చింట్లు లాంటి ధాన్యానికి మంచి ధర పెడుతున్నట్లు రైతులు అంటున్నారు. ఆ ధాన్యం క్వింటాకు రూ.2,600 వరకు కొనుగోలు చేస్తున్నారు.
సన్న ధాన్యం తీసుకొచ్చిన ప్రతి రైతు నుంచి తప్పనిసరిగా క్వింటాకు రూ.2,450 ఇచ్చి కొనుగోలు చేయాలని జిల్లా అధికారులు మిల్లర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు సివిల్ సైప్లె, వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలతో కూడిన కమిటీ వేసింది. ఈ యంత్రాంగం పలు మిల్లులను తిరిగి ధాన్యం కొనాలని చెప్పుతున్నా ఆచరణలో అమలు కావడం లేదు. నాణ్యత పేరుతో మిల్లర్లు ధాన్యం కొనకుండా రైతులను ఇబ్బందులు పెడుతుంటే సమావేశాలు, సంప్రదింపులు అని కాలం గడుపుతున్నారే తప్ప క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని రైతుల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
సన్న ధాన్యం తీసుకొని రైతులు మిల్లుల వద్దకు వస్తే వెనక్కి పంపకుం డా తప్పని సరిగా కొనుగోలు చేయాలని అన్ని మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశాం. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి మిల్లుల వద్ద పర్యవేక్షణ చేయిస్తున్నాం. ఎవరైనా క్వింటాకు కనీస ధర రూ.2,450 పెట్టి కొనుగోలు చేయాలి. రైతులు కూడా నాణ్యంగా ఉన్న ధాన్యం తీసుకొని రావాలి.
-వెంకటేశ్వర్లు, నల్లగొండ డీఎస్ఓ
సన్న ధాన్యం అంతా ఒకే రకంగా క్వాలిటీతో ఉంటుంది. ఈ సీజన్లో నీటి కొరత కారణంగా కొంత క్వాలిటీలో తేడా వస్తుంది. దాన్ని ఇప్పుడు కాకుండా పాత బియ్యం అయ్యాక వండితే మంచి నాణ్యంగా ఉంటుంది. మిల్లర్లు లేనిపోనిది సాకుగా చూపి రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు. రైతులు కూడా నాణ్యంగా ఉన్న ధాన్యం ఒక రాశిలో, నాణ్యంగా లేని ధాన్యం మరో రాశిలో తీసుకెళ్లాలి.
– శ్రవణ్కుమార్, నల్లగొండ జిల్లా వ్యవసాయాధికారి