ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కంటి వెలుగు గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొదలైంది. తొలిరోజు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నిర్దేశించిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒకరి తర్వాత ఒకరు కంటి పరీక్షలు చేయించుకునేందుకు క్యూలో బారులు దీరారు. వేములపల్లిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, సూర్యాపేట మున్సిపాలిటీలోని కుడకుడలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కంటి వెలుగుకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించారు. జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్లు, ఇతర అధికారులు భాగస్వాములయ్యారు. తొలిరోజు నల్లగొండ జిల్లాలో 74 బృందాలు 8,391 మందికి, సూర్యాపేట జిల్లాలో 51 బృందాలు 5,714 మందికి పరీక్షలు చేశాయి. అవసరమైన వారికి అక్కడే రీడింగ్ గ్లాసులు అందించాయి. ఇతర దృష్టి లోపం ఉన్న వాళ్లకు అవసరమైన కళ్లద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
నల్లగొండ ప్రతినిధి, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం లాంఛనంగా మొదలైంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే క్యాంపులను ప్రారంభిస్తూ పరీక్షలకు ఉపక్రమించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలంతా తరలివచ్చి కంటివెలుగు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రముఖులు, వివిధ శాఖల అధికారులు కంటివెలుగు ప్రారంభోత్సవంలో పాలుపంచుకున్నారు. నల్లగొండ జిల్లాలో వేములపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, రాష్ట్ర ఆగ్రోస్ సంస్థ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుత్తా సుఖేందర్రెడ్డితోపాటు ఎమ్మెల్యే, ఇతర ప్రముఖులు పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని షాబూనగర్, బాపూజీనగర్, వెంకటాద్రిపాలెంలోనూ గుత్తా సుఖేందర్రెడ్డి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కంటివెలుగు శిబిరాలను ప్రారంభించారు. వెలుగులు పంచే ఇంతటి మంచి కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని గుత్తా పిలుపునిచ్చారు
కేతేపల్లిలో కలెక్టర్ వినయ్కిృష్ణారెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి పరీక్షలు చేయించుకున్నారు. గుర్రంపోడు, నార్కట్పల్లి మండలాల్లో జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించి కంటి పరీక్షలు చేయించుకున్నారు. నల్లగొండలోని ఐఎంఏ హాల్లో ఉదయాన్నే స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ వినయ్కిృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లికార్జున్రెడ్డితో కలిసి కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించి కంటి పరీక్షలు చేయించుకున్నారు. కలెక్టర్ చేతుల మీదుగా ఎమ్మెల్యే కంచర్ల రీడింగ్ గ్లాస్ స్వీకరించారు. దేవరకొండ, కొండమల్లేపల్లి, చింతపల్లి మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించారు. మునుగోడు, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, నందికొండలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, త్రిపురారంలో రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇస్లావత్ రాంచంద్రనాయక్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సూర్యాపేట జిల్లాలో తొలిరోజు 51 కేంద్రాల్లో కంటి పరీక్షలకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని కుడకుడలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్తో కలిసి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కంటి వెలుగు కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. మంత్రి కంటి పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకొని దృష్టి లోపాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. నాగారం మండల కేంద్రం, తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో, మోత్కూరులో రాష్ట్ర ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తుంగతుర్తిలో జడ్పీ చైర్మన్ గుజ్జ దీపికాయుగేందర్రావు, కోదాడ పట్టణం, నడిగూడెం, అనంతగిరి, చిలుకూరు మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. హుజూర్నగర్, నేరేడుచర్ల, గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి కంటి పరీక్షలు చేయించుకున్నారు.
నల్లగొండ జిల్లాలో తొలి రోజు మొత్తం 74 చోట్ల కంటివెలుగు శిబిరాలు ప్రారంభమయ్యాయి. క్యాంపుల్లో 74 వైద్య బృందాలు 8,391 మందికి పరీక్షలు చేపట్టాయి. ఇందులో 1,847 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశారు. మరో 1,772 మందికి ఇతర కళ్లద్దాల కోసం ఆర్డర్ చేశారు. అవి 15 రోజుల్లో రానున్నాయని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 51 ప్రాంతాల్లో కంటి పరీక్షలు నిర్వహించారు. శిబిరాలకు సాయంత్రం ఆరు గంటల వరకు 5,714 మంది వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 1,452 మందికి రీడింగ్ గ్లాస్లు అందజేశారు. మరో 69 మందికి ఒకటి రెండు రోజుల్లో అందజేస్తామని ప్రకటించారు. 1,577 మందికి ఇతర దృష్టి లోపాలకు సంబంధించిన కళ్లద్దాల కోసం ఆర్డర్ చేశారు.