ఆత్మకూర్.ఎస్, మార్చి 16 : గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూర్.ఎస్ మండలంలోని మక్తా కొత్తగూడెం గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న కొత్త గ్రామ పంచాయతీ భవనానికి మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలన్న మహాత్ముడి కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కోసం రాజీ లేకుండా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణాలో గతంలో 8,670 గ్రామ పంచాయతీలు ఉండేవి.. పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ వాటిని 12,751కి పెంచారు. 2,800 తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దినట్లు వివరించారు. దేశంలో ఉత్తమ పంచాయతీలుగా ఎన్నిక కాబడిన ఎక్కువ పంచాయతీలు మన రాష్ట్రం నుంచే ఎన్నికైనట్లు తెలిపారు.
సీఎం ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయన్నారు. 2014కు ముందు కక్ష్యలు, పార్టీల కొట్లాటలతో ఉన్న గ్రామాల్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొని ప్రజలు హాయిగా గడుపుతున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో సమస్యలపై సర్పంచులు దృష్టి సారించి, గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవవన్నారు. గ్రామాల్లో సంక్షేమ పథకం లబ్దిపొందని గడపలేదన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, ఎంపీపీ మర్ల స్వర్ణలతాచంద్రారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కొణ తం సత్యనారాయణరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మర్ల చంద్రారెడ్డి, మండలాధ్యక్షుడు తూడి నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్, సర్పంచులు, ఉప సర్పంచులు పాల్గొన్నారు.
నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి
బొడ్రాయిబజార్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మాణం అవుతున్న ఎస్టీపీ ప్లాంట్కు సంబంధించిన పనులను నెల రోజుల్లో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పబ్లిక్ హెల్త్ చీఫ్ ఇంజినీర్ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డితో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సీవరేజ్ ట్రిట్మెంట్ ప్లాంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో పాటు అసంపూర్తిగా ఉన్న నాళా నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీ లేకుండా నిర్మాణం చేయాలని సూచించారు. సమీక్షలో పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ పాల్గొన్నారు.