అన్ని ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసుకుందాం
రాజీవ్నగర్ చౌరస్తాలో వాటర్ ఫౌంటేన్
ఏర్పాటుకు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పరిశీలన
జోరువానలోనూ సాగిన మంత్రి పర్యటన
సూర్యాపేట టౌన్, జూలై 11 : సూర్యాపేట పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుందామని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 23వ వార్డు పరిధి రాజీవ్నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేయనున్న వాటర్ ఫౌంటేన్ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. వాటర్ ఫౌంటేన్ నిర్మాణం, ప్రజలకు ఇబ్బందులు కాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఇంజినీరింగ్ అధికారులకు సూచనలు ఇచ్చారు. జోరువానలోనూ మంత్రి పట్టణాభివృద్ధి కోసం కృషి చేయడం, తమ కాలనీకి రావడంతో రాజీవ్నగర్వాసులు సంతోషం వ్యక్తం చేశారు.
పట్టణంలో రెండో మినీ ట్యాంక్బండ్గా రూపుదిద్దుకుంటున్న పుల్లారెడ్డి చెరువు మార్గమధ్యంలో ఈ ఫౌంటేన్ నిర్మాణం జరుగడాన్ని ఆయా కాలనీ వాసులు స్వాగతిస్తున్నారు. ఇప్పటికే సూర్యాపేట గణనీయంగా ప్రగతి సాధించిందని, దశలవారీగా అన్ని కాలనీలను అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్ వల్దాస్ సౌమ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వల్దాస్ జాని, అధికారులు ప్రసాద్, సత్యారావు ఉన్నారు.