సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రతినిధులతో సన్నాహక సమావేశం సభ సక్సెస్ కోసం ఇన్చార్జిలుగా ఎంపీ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ల నియామకంఅనంతరం సభా స్థలం పరిశీలన ఈ నెల 20న సూర్యాపేటలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభతో రాష్ట్రంలో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సభ సక్సెస్ కోసం మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులతో మంత్రి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో లక్షల మంది లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ను చూడాలని రెట్టింపు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారని అన్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజలకు ఏర్పాట్లు చేయాలని ప్రజాపత్రినిధులు, బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లను సభ నిర్వహణకు ఇన్చార్జిలుగా నియమించారు. అనంతరం నూతన వ్యవసాయ మార్కెట్ సమీపంలో సభ ఏర్పాట్లను పరిశీలించారు.
– సూర్యాపేట, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 20న సూర్యాపేటలో నిర్వహించ తలపెట్టిన సీఎం కేసీఆర్ సభతో రాష్ట్రంలో విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్హాల్లో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. సమావేశంలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ సీఎం చేతుల మీదుగా నూతన సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీసు కార్యాలయం, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్, ఎస్టీపీలతో పాటు బీఆర్ఎస్ కార్యాలయాల ప్రారంభోత్సవాలు ఉండనుండగా స్థానిక వ్యవసాయ మార్కెట్ సమీపంలోని 75 ఎకరాల్లో భారీ బహిరంగ సభ జరుగనుందన్నారు. బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి లక్షన్నర నుంచి రెండు లక్షల మంది హాజరవుతారనే అంచనాలు ఉండగా తదనుగుణంగా ఏర్పాట్లు ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ఇటీవల కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలతో విపక్షాలు షాక్కు గురయ్యాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండడంతో ప్రతిపక్షాలకు పాలుపోక కొన్ని సమస్యలను పట్టుకొని వేలాడుతున్నారన్నారు. రైతు రుణమాఫీ తామే చేస్తాము, ఆర్టీసీ ఉద్యోగులకు మేమే దిక్కు, పోడు భూములను తామే పట్టాలు ఇస్తాం, వీఆర్ఏలను క్రమబద్ధ్దీకరిస్తాం అంటూ గత కొద్ది కాలంగా విపక్షాలు ప్రచారం చేసుకుంటుంటే సీఎం కేసీఆర్ ఇచ్చిన షాక్లకు ప్రతిపక్షాలు ఇప్పట్లో కోలుకునే విధంగా కనిపించడం లేదని మంత్రి ఎద్దేవా చేశారు.
చరిత్రలో నిలిచిపోయేలా సీఎం కేసీఆర్ సభ
కాళేశ్వరం జలాలతో సూర్యాపేట నియోజకవర్గాన్ని పచ్చగా మార్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ రాక కోసం సూర్యాపేట ప్రజలు అతృతగా ఎదురు చూస్తున్నారని మంత్రి అన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రలో నిలిచిపోయేలా సీఎం సభ ఉంటుందన్నారు. మేము సింహాలమని మాకు ఎదురే లేదని విర్రవీగిన కాంగ్రెస్ వృద్ధ సింహాలను మట్టి కరిపించిన ఘనత సీఎం సారధ్యంలోని బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యేలది, బీఆర్ఎస్ శ్రేణులదే అన్నారు. 12కు 12 స్థానాల్లో గులాబీ జెండాను ఎగురవేసి ఉమ్మడి నల్లగొండ జిల్లా కేసీఆర్ ఖిల్లాగా మారిందన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఉమ్మడి జిల్లాలో 12 స్థానాల్లోను ఎగిరేది గులాబీ జెండానే అని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడిగా ఏమి కావాలో తెలిసిన నాయకుడిగా కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, 24గంటల విద్యుత్, ఆసరా పెన్షన్ల నుంచి నిన్నటి రుణమాఫీ వంటి పథకాలను తీసుకొచ్చి ప్రజల మనసులో సీఎం కేసీఆర్ సుస్ధిర స్థానం పొందారని కొనియాడారు.
పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు సూర్యాపేట జిల్లాగా మారడమే కాదు అందుకు అనుగుణంగా అద్బుతమైన సమీకృత కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయ భవనం, మోడల్ మార్కెట్తో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం మెడికల్ కళాశాలను నిర్మించి సూర్యాపేట విశిష్టతను కీర్తిని పెంచిన ఘనత ముక్యమంత్రి కేసీఆర్దే అన్నారు. ఆయన రాకను ప్రజలు పండుగలా భావిస్తున్నారని ఆయన రాక కోసం వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. కేసీఆర్ రాక సందర్భంగా లక్షలాదిగా స్వచ్చందంగా తరలివచ్చేందుకు సిద్దమవుతున్న ప్రజల కోసం బీఆర్ఎస్ శ్రేణులు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి జగదీశ్రెడ్డి దిశానిర్దేశం చేశారు.
అనంతరం ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిదులతో కలసి నూతన మార్కెట్ సమీపంలోని సీఎం కేసీఆర్ బహిరంగ సభ స్థలిని మంత్రి జగదీశ్రెడ్డి పరిశీలించారు. ఇంకా కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, నాయకులు గుజ్జ యుగేందర్రావు, నంద్యాల దయాకర్రెడ్డి, నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.