శ్రీరామ నవమి వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం వైభవంగా జరిగాయి. సీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయాలతోపాటు పలుచోట్ల కనుల పండువగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా ఊరూవాడ రామనామ స్మరణ మార్మోగింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వేదాంత భజన మందిరంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్థానికంగా ఎమ్మెల్యేలతోపాటు ప్రజాప్రతినిధులు రాముల వారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అన్ని చోట్లా అన్నదానాలు, ప్రసాదాల పంపిణీ సాగింది. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ ఏడాది సైతం సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు, ఉద్యోగ, వ్యాపారాలతో ప్రతి ఇంటా సిరులు నిండాలని ఆకాంక్షించారు.
సూర్యాపేట టౌన్, మార్చి 30 : సూర్యాపేటలో సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేదాంత భజన మందిరంతో పాటు ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపాల వద్ద సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవానికి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సతీమణి సునీతతో కలిసి క్యాంపు కార్యాలయం నుంచి నూతన పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు, పూల దండలతో తరలివెల్లి వేదాంత భజన మందిరంలో పీటలపై కూర్చుని కల్యాణతంతు జరిపించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. మానవ సమాజంలో మంచిని గ్రహించాలన్నదే రామాయణ పరమార్థం అని పేర్కొన్నారు. ఆదిశగా అంతా మంచిని పెంపొందించడంతో పాటు ఎదుటివారికి సాయపడే గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. తొమ్మిదేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అన్ని రంగాలు ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేసుకుంటూ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటున్నామన్నారు. ఈ ఏడాది సైతం సకాలంలో వర్షాలు సమృద్ధిగాపడి పాడి పంటలు, ఉద్యోగ, వ్యాపారాలతో ప్రతి ఇంటా సిరులు నిండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంతో పాటు యావత్ దేశం కూడా సుభిక్షంగా మారాలని అన్ని రాష్ర్టాల ప్రజలు ఆయన నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. వేడుకలో ఎంపీ బడుగుల లింగయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మార్కెట్ మాజీ చైర్పర్సన్ ఉప్పల లలితాఅనంద్, పాల్గొన్నారు.