పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు నెల రోజులపాటు ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెలవంక దర్శనమివ్వగా శనివారం ఈదుల్ ఫిత్న్రు భక్తి శ్రద్ధలతో జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈద్గాహ్లు, మసీదులను విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. సామూహిక ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు చేశారు. పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక వంటకాలు చేసుకొని కుటుంబ సభ్యులు ఆస్వాదించడంతోపాటు బంధుమిత్రులకు పంచిపెడతారు. పేదలకు దానధర్మాలు చేస్తారు. ముస్లింలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సర్వ మత సమ్మేళనానికి తెలంగాణ దిక్సూచి అని, అల్లాహ్ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వారు కోరారు.
– రామగిరి/సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 21
రామగిరి/ సూర్యాపేట రూరల్/ నేరేడుచర్ల, ఏప్రిల్ 21 : అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం పురస్కరించుకుని నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు నెల వంక దర్శనమివ్వడంతో వేడుకలకు సమాయత్తమయ్యారు. నెల రోజులుగా చేసిన ఉపవాసాలు విరమించడం, పరిసమాప్తం చేసిన సందర్భంగా పేదలకు చేసే తప్పనిసరి దానాన్ని ఫిత్ అంటారు. దీంతోనే రంజాన్ పండుగకు ఈదుల్ ఫిత్ అని పేరు వచ్చింది. ఈదుల్ ఫిత్ అంటే రమజాన్ ఉపవాసాలు ముగించి సంతోషిస్తూ పండుగ చేసుకునే రోజు. శనివారం ఈదుల్ ఫిత్ (రంజాన్) పురస్కరించుకుని ప్రత్యేక నమాజ్ చేయడానికి జిల్లావ్యాప్తంగా ఈద్గాహ్లు, మసీదులను విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబుచేశారు. రంజాన్ పండుగ రోజు వేకువజామునే లేచి పరిశుద్ధులై ఫజర్ నమాజ్ ఆచరించి షీర్ ఖుర్మా తీపిని ఆరగించి, నూతన వస్ర్తాలు ధరించి ప్రత్యేక నమాజ్ ఆచరించుటకు సాముహికంగా ముస్లింలంతా ఈద్గాహ్లకు వెళ్తారు. రెండు రకాత్ల ఈద్ నమాజ్ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకొంటారు. తరువాత ఖబ్రస్తాన్కు వెళ్లి గతించిన తమ కటుంబ సభ్యులకు, పెద్దలకు నివాళులు (దురూద్) సమర్పిస్తారు. అక్కడి నుంచి తమ బంధువులు, మిత్రుల ఇండ్లకు వెళ్లి ఈద్ ముబారక్ తెలిపి ఇంటికి చేరుకుని పండుగ సందర్భంగా తయారు చేసుకున్న ప్రత్యేక వంటకాలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తారు. పండుగ శుభ సందర్భంలో పేదలు సైతం ఆనందంగా గడపడానికి ఫిత్రా దానంగా తన కుటుంబంలోని ప్రతి ఒక్కరి పేర రూ.50 చొప్పున ముస్లిం స్త్రీ, పురుషులు విధిగా, అదేవిధంగా పుట్టిన శిశువు పేరిట ఫిత్రా చెల్లిస్తారు.
మార్కెట్లో రంజాన్ సందడి
రంజాన్ పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంతోపాటు పట్టణాల్లో మార్కెట్ సందడి కనిపించింది. ముఖ్యంగా సేమియాకు కావాల్సిన వస్తువులతోపాటు వివిధ డ్రైఫ్రూట్స్ కొనుగోలు చేశారు. వస్ర్త, వ్యాపార దుకాణాలు కిక్కిరిశాయి. రంజాన్ మాసంలో మాత్రమే లభించే హరీస్, హలీమ్ కోసం అన్ని వర్గాల ప్రజలు తయారీ కేంద్రాలకు వెళ్లారు.
ఈదుల్ ఫిత్ (రంజాన్) పురస్కరించుకుని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మసీదులు, ఈద్గాహ్లు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో అలంకరించారు. నల్లగొండ పట్టణంలోని మునుగోడు రోడ్డులో గల ఈద్గాహ్లో జిల్లా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఈద్గాహ్ను సుందరంగా తీర్చిదిద్ది, అన్ని మౌలిక వసతులు కల్పించారు. పోలీసుల బందోబస్తు ఏర్పాట్లతోపాటు డాగ్స్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలోని 13వార్డు గాంధీనగర్ సమీపంలోని ఈద్గాహ్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రార్థనల్లో సుమారు 10వేల మంది పాల్గొననుండగా.. ఆ మేరకు వసతులు కల్పించారు. ఈ వేడుకలకు జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులతోపాటు కలెక్టర్, ఎస్పీ, అధికారులు, ముస్లిం మతపెద్దలు, వివిధ పార్టీల నాయకులు హాజరై పండుగ శుభాకాంక్షలు తెలుపనున్నారు.
సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 21 : సర్వమత సమ్మేళనానికి తెలంగాణ దిక్సూచిగా నిలుస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఇటువంటి ఐక్యత ఎప్పటికీ కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అల్లాహ్ కరుణ చూపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ముస్లింలు నెల రోజుల ఉపవాస దీక్షల ఆరాధన ఫలించే రోజే రంజాన్ పర్వదినమని అన్నారు.
రామగిరి, ఏప్రిల్ 21 : తెలంగాణ రాష్ట్ర ముస్లింలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు పవిత్రతో జరుపుకొన్న ముస్లింలు అల్లాహ్ అనుగ్రహంతో పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. అల్లాహ్ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరారు. ముస్లిం, మైనారిటీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని ఆయన తెలిపారు. రంజాన్ పండుగను తగు జాగ్రత్తలు తీసుకొంటూ ఘనంగా జరుపుకోవాలని గుత్తా సుఖేందర్రెడ్డి ముస్లింలకు సూచించారు.