నల్లగొండ ప్రతినిధి, జూలై 18 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి 57వ జన్మదిన వేడుకలు సోమవారం పండుగలా జరిగాయి. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు. మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలుపడంతోపాటు రక్తదానం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ట్రైసైకిళ్లు, పండ్లు, చీరలు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా మంత్రి జగదీశ్రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ వెన్నుతట్టి ఆశీర్వదించారు. యువనేత కేటీఆర్తోపాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు ఇలా అనేక మంది ప్రత్యక్షంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
దేశ, విదేశాల నుంచి కూడా పలువురు గ్రీటింగ్స్ తెలియజేశారు. మంత్రి జగదీశ్రెడ్డి మినిస్టర్స్ క్వార్టర్స్లోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం తెలంగాణభవన్లో జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మొక్కలు నాటి గ్రీన్ఇండియా ఛాలెంజ్లో భాగస్వాములయ్యారు. అనంతరం ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి స్వయంగా పాల్గొని కేట్ కట్ చేసి పార్టీ శ్రేణులతో సందడి చేశారు. తనపై అభిమానంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా శుభాకాంక్షలు తెలుపుతూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ తాను కృతజ్ఞతుడనంటూ మంత్రి జగదీశ్రెడ్డి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.
సూర్యాపేట మండలంలోని సపావట్తండా – ఎండ్లపల్లి గ్రామ రహదారికి ఇరువైపులా 2వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్, డీఎస్పీ నాగభూషణం ప్రారంభించారు. డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ పిన్నాయిపాలెంలో విద్యార్థులకు సైకిళ్లు, పుస్తకాలు పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్ నాకు ఆరాధ్య దైవం
ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు ఆరాధ్య దైవం. ఆయన ఆశీస్సులతోనే ఈ స్థాయికి చేరుకున్నా. నా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆశీస్సులు అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు. అదేవిధంగా తనను ఆశీర్వదించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితోపాటు సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– మంత్రి జగదీశ్రెడ్డి