ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
విద్యుత్ ప్రసారాలను గమనిస్తుండాలి
అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి
పత్తి, వరి పంటలు దెబ్బ తినకుండా చూడాలి
అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
యాదాద్రి కలెక్టరేట్లో ప్రత్యేక సమీక్ష
భువనగిరి కలెక్టరేట్, జూలై 13 : వర్షాల ఉధృతి తీవ్రంగా ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కోరారు. విద్యుత్ ప్రసారాలు- ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, అవసరమైతే అదనంగా కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించుకోవాలని అధికారులను ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎడతెరిపిలేని వానల నేపథ్యంలో బుధవారం కలెక్టరేట్లో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ పమేలాసత్పతి, అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాస్రెడ్డి, దీపక్ తివారీ, డీసీపీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పాత గోడలు, శిథిలావస్థకు చేరుకున్న భవనాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల తీవ్రత తగ్గే వరకూ అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కోరారు. అనంతరం వసాయాధికారులతోసమావేశమయ్యారు. వర్షాలతో పత్తి, వరి పంటలు దెబ్బతినకుండా చూడాలని ఆదేశించారు. రిజర్వాయర్లు, కాల్వలు, వాగులు పొంగి పొర్లుతున్నందున అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలపై దృష్టి సారించాలని సూచించారు. లాభదాయక పంటలపై రైతుల్లో అవగాహన పెంపొందించాలని, ముఖ్యం గా ఆయిల్పామ్ సాగువైపు ప్రోత్సహించాలని తెలిపారు.