సూర్యాపేట, ఏప్రిల్ 26 : యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశించారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 293 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు 20 వేల బస్తాలు మాత్రమే సేకరించడంపై అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అలసత్వం వీడి వేగంగా ధాన్యం కొనుగోళ్లు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్ను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికారులు, మిల్లర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 72 రైస్ మిల్లులు ఉండగా కేవలం 37 మిల్లులు మాత్రమే ధాన్యం కొనుగోలుకు ముందుకు రావడమేందని అధికారులను ప్రశ్నించారు. మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ యజమానులు అలసత్వం ప్రదర్శించరాదని, సరిపడా హమాలీలను వెంటనే నియమించుకుని ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాల పేరుతో కోతలు పెట్టొద్దన్నారు. అదేసమయంలో నాణ్యమైన ధాన్యం తీసుకరావడంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అకాల వర్షంతో ఆందోళనలో ఉన్న రైతులకు బాసటగా నిలువాలని కోరారు. సీఎంఆర్ బియ్యం అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వాని నుంచి రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు.
తడిసిన ధాన్యంపై ఆందోళన వద్దు
తడిసిన ధాన్యం గురించి రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చివరి గింజా వరకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారన్నారు. ఆకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజుల్లో పూర్తి వివరాలు సేకరించి రైతులను ఆదుకుంటామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లుతో పాటు అకాల వర్షాలకు సంబంధించిన పంట నష్టంపై చిల్లర రాజకీయాలు తగదని ఆయన విపక్షాలకు ఉద్బోదించారు. వ్యవసాయానికి గౌరవం తీసుకొచ్చిందే ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన చలువతోనే అన్నది ప్రపంచానికి తెలుసు అన్నారు. కలెక్టర్ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అదనపు కలెక్టర్ మోహన్రావుతోపాటు వివిధ శాఖల అధికారులు, మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు, ట్రాన్స్పోర్టు నిర్వహకులు పాల్గొన్నారు.