స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఉమ్మడి జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం పండుగలా జరిగింది. పల్లె పట్నం అనే తేడా లేకుండా అంతటా మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కల కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు జాతీయ జెండాలు చేతపట్టి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. ఒక్కరోజే నల్లగొండ జిల్లాలో 8,65,575, సూర్యాపేటలో 4,50,000 మొక్కలను నాటారు. సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ సమీపంలోని దశాబ్ది వనంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి.. ఎంపీ బడుగుల లింగయ్య, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మొక్కలు నాటగా ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం మొక్కలు నాటే కార్యక్రమం పండుగలా జరిగింది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా అంతటా మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజలు కలిసి ఉమ్మడి జిల్లాలో 17లక్షలకు పైగా మొక్కలు నాటారు. ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీల్లో 8,65,575 మొక్కలు నాటారు. 8,58,999 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 100.77శాతం మొక్కలు నాటుకున్నాయి. సూర్యాపేట జిల్లాలో సుమారు నాలుగు లక్షలా 50వేలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు లక్షల మొక్కలు నాటారు.
‘భవిష్యత్ తరాలకు మనమందించే ఆస్తి పర్యావరణమే. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ ప్రశాంతంగా సాగుతుంది. పచ్చదనం పెంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. అన్ని రంగాల అభివృద్ధితోపాటు పచ్చదనం పెంచడంలో తెలంగాణ రాష్ట్రం ముందుంది. అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ దేశం కోరుకుంటున్నది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. హరితహారం వల్లే వాతావరణ సమతుల్యం ఏర్పడింది. రాష్ట్రంలో పచ్చదనం పెరిగింది’
-కోటి వృక్షార్చనలో రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి