నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో మొత్తం ఎంతమంది డాక్టర్లు పని చేస్తున్నారో పరిశీలించి.. గైర్హాజరుపై సీరియస్ అయ్యారు. నిర్ధ్దేశించిన పని వేళల్లో సక్రమంగా విధులు నిర్వర్తించాలని, లోపాలను అధిగమించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వీలైనంత వరకు ఇక్కడే వైద్యం చేయాలని, తప్పనిసరి అయితేనే హైదరాబాద్కు రెఫర్ చేయాలని స్పష్టంచేశారు. గైనిక్ విభాగంలో 500లోపు ఉన్న ప్రసవాల సంఖ్యను 700కి పెంచాలని సూచించారు. మెడికల్ డైరెక్టర్ రమేష్ త్వరలోనే పరిశీలనకు వస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చొరవ వల్లే నల్లగొండ, సూర్యాపేటకు మెడికల్ కాలేజీలు వచ్చాయన్న మంత్రి… నల్లగొండలో మెడికల్ కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ రాహుల్శర్మను ఆదేశించారు.
నీలగిరి, జూలై 26 : ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే ఉమ్మడి జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానను ఆకస్మికంగా సందర్శించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ మెడికల్ కళాశాల పనులు బుధవారం ప్రారంభం కావాలని కలెక్టర్ను ఆదేశించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలంటే నూతన మెడికల్ కళాశాల భవన నిర్మాణం అవసరమని అభిప్రాయపడ్డారు. సమీక్షా సమావేశంలో కొన్ని లోపాలను గుర్తించామని, వాటిని అధిగమించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కొంతమంది డాక్టర్లు అనుమతి లేకుండా గైర్హాజర్ అయినట్లు, మరికొంత మంది మధ్యాహ్నం వెళ్లినట్లు తెలిపారు.
డాక్టర్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వర్తించాలని సూచించారు. సాయంత్రం సైతం ఓపీ సేవలు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినందున డాక్టర్లు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. ఆస్పత్రిలో ప్రీ డయాగ్నస్టిక్ పరీక్షలు, బ్లడ్ పరీక్షలు త్వరితగతిన నిర్వహించాలన్నారు. ఆర్థోపెడిక్ విభాగంలో 14 మంది డాక్టర్లు ఉన్నారని, మోకాలు కీలు మార్పిడి పరీక్షలు కూడా చేస్తున్నారని, రోగులు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోకుండా చూడాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మలేరియా, డెంగీ ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. డాక్టర్లు రోగుల పట్ల ప్రేమ పూర్వకంగా ఉండాలని సూచించారు. వైద్య విద్యార్థులు హాస్టల్, తరగతి గదులు, లైబ్రరీ బలోపేతం తదితర సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో డీఎంఈ రావాలని ఆదేశించినట్లు చెప్పారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కలెక్టర్ రాహుల్శర్మ, ఆస్పత్రి సూపరింటెండెంట్ లచ్చూనాయక్, డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృ, జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ పుల్లారావు, టీఆర్ఎస్ నాయకులు పిల్లి రామరాజు, సందినేని జనార్దన్రావు ఉన్నారు.
జడ్పీ చైర్మన్కు మంత్రి పరామర్శ
నల్లగొండ : జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డిని మంత్రి హరీశ్రావు పరామర్శించారు. సూర్యనగర్ కాలనీలోని తన నివాసంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి పరామర్శించారు. నరేందర్రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురై కాలుకు శస్త్ర చికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉద్యమకాలంలో తమకున్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, కనగల్, నార్కట్పల్లి ఎంపీపీలు కరీం పాషా, సూదిరెడ్డి నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పంకజ్ యాదవ్ ఉన్నారు.