యాదాద్రి భువనగిరి, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ వస్తే కటిక చీకట్లే.. దొంగలా కరెంట్ వస్తుంది. కాలిపోయిన మోటర్లు వస్తాయి. అద్దమరాత్రి పొలాల వద్ద పడిగాపులు గాయాలి.. దొంగోడి కరెంట్తో ఎవుసం ఎట్ల చేస్తం..? రిస్క్ వద్దు కారుకు గుద్దు’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. శనివారం భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్షోలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అంటున్నారని, 11 సార్లు గెలిస్తే ఏం చేశారని ప్రశ్నించారు.
కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని, మళ్లీ ఏముఖం పెట్టుకుని ఓట్లడుగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు 24గంటల కరెంట్ వద్దని, 3 గంటల విద్యుత్ చాలని అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నారని, రేవంత్రెడ్డి రైతులను బిచ్చగాళ్లుగా పోలుస్తున్నారని, ఇలాంటి పార్టీ అవసరమా అని దుయ్యబట్టారు. కర్ణాటకలో గెలిపిస్తే రాష్ర్టాన్ని ఆగమాగం చేస్తున్నారని, కనీసం విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ రైతులకు 11సార్లు రైతుబంధు సాయం అందిస్తే, కాంగ్రెస్ కనీసం 11 పైసలు కూడా ఇవ్వలేదన్నారు.
రైతులకు రూ.73వేల కోట్ల రైతుబంధు సాయం అందిందని వివరించారు. ఈ నెల 28న అందరికీ రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. కాంగ్రెస్ను నమ్మొద్దని, ఆ పార్టీని నమ్మితే కర్ణాటకలో మోసం చేసిందని, తెలంగాణను కూడా మోసం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే మన కన్నును మనమే పొడుచుకున్నట్లు అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీది సుతి లేని సంసారం అని, వాళ్లకు వాళ్లే కొట్లాటలు పెట్టుకుంటారని చెప్పారు. ఢిల్లీ పార్టీలకు గులాంగిరీ చేద్దామా..? మన పార్టీని కాపాడుకుందామా..? కాంగ్రెస్ కావాల్నా..? కరెంట్ కావాల్నా? అనేది ప్రజలే తేల్చుకోవాలని, కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ రక్కసి వెంటాడిందని, కేసీఆర్ వచ్చాక ఫ్లోరైడ్ను పారదోలారని గుర్తుచేశారు. భువనగిరి ప్రాంతంలో ఐటీ, ఇండస్ట్రియల్ పరిశ్రమలు తీసుకొస్తామని, భువనగిరిలో ఐటీ టవర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వీటితో వేలాది మందికి ఉపాధి కలుగుతుందన్నారు.
‘పైళ్ల శేఖర్రెడ్డి మంచోడు. ఉత్తమ ఎమ్మెల్యే. చీమకు కూడా హాని చేయని వ్యక్తి. ఎక్కడో వ్యాపారాలు చేస్తూ.. ఇక్కడ ఖర్చు పెడుతున్నరు. మూడోసారి గెలిస్తే ప్రమోషన్ వస్తుంది. అనుభవం కూడా వస్తుంది. శేఖర్రెడ్డికి ప్రమోషన్ వస్తే.. భువనగిరికి వచ్చినట్లే. కాంగ్రోసోడు గెలిస్తే ఏం వస్తుంది..? శేఖర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి.’ అని హరీశ్రావు పిలుపునిచ్చారు. పైళ్ల శేఖర్రెడ్డి దమ్మున్న నేత అని, ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్రెడ్డి, అమరేందర్గౌడ్ పాల్గొన్నారు.
భువనగిరికి మంత్రి హరీశ్రావు రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పోయినసారి కూడా ఇదే ప్రాంతంలో హరీశ్రావు ప్రచారం చేశారని, అప్పుడు కూడా గెలిచానని చెప్పారు. భువనగిరి నియోజకవర్గాన్ని, ముఖ్యంగా భువనగిరి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. కేసీఆర్ మూడోసారి సీఎం కానున్నట్లు చెప్పారు. హరీశ్ రావు మరోసారి మంత్రి అయ్యాక భువనగిరిని అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు.