తిరుమలగిరి, జూన్ 2 : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచించారు. శుక్రవారం తిరుమలగిరిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి ఉత్సవాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 21 రోజులపాటు నిర్వహించే ఉత్సవాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు. 2014 తర్వాత 9 ఏండ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో సాధించిన ప్రగతి ప్రతిబంబించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రోజుకో కార్యక్రమం చొప్పున చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంలో నాడు, నేడు సాధించిన ప్రగతిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
గతంలో తాగునీరు కోసం ఎన్నో కిలోమీటర్లు నడిచిన సందర్భాలు ఉన్నాయని, గత పాలకులు గ్రామాలకు కూడా వెళ్లే వారు కాదని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందిస్తున్నామని, దేశంలో మరెక్కడా ఇలాంటి పథకం లేదని మంత్రి పేర్కొన్నారు. గత పాలకుల పాలనలో వానలు రాక, సాగునీరు లేక పంటలు పండేవి కాదని, రైతులు అప్పుల పాలయ్యే వారని గుర్తుచేశారు. గతంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొటి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాక ముందు 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తే, స్వరాష్ట్రంలో 5.80లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందన్నారు. మంచినీళ్ల పండుగ రోజు గ్రామాల్లో మహిళలు పెద్దఎత్తున ఊరేగింపు నిర్వహించాలని మంత్రి కోరారు. ఊరూరా చెరువుల పండుగ రోజున లక్ష మందితో మానవహారం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఉత్సవాలను
ఘనంగా జరుపుకోవాలి : ఎమ్మెల్యే కిశోర్
ఎమ్మెల్యే కిశోర్కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని, ఊరూరా పండుగ వాతావరణం కనిపించాలని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించిన ప్రగతి ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.నేడు రైతు దినోత్సవం సందర్భంగా తెలంగాణలో వ్యవసాయంలో వచ్చిన మార్పులు, ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, పంటల సాగు వివరాలు ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా ప్రదర్శించాలన్నారు. సాగునీటి దినోత్సవం రోజున స్వరాష్ట్రంలో పెరిగిన ఆయకట్టుకు సంబంధించిన వివరాలు వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలు ఎక్కడ ఎలా నిర్వహించాలనే తీరుపై ఆయాశాఖల అధికారులు వివరించారు. కార్యక్రమంలో సూర్యాపేట కలెక్టర్ వెంకట్ర్రావు, యాదాద్రి భువనగిరి అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, డీఎస్పీ నాగభూషణం, డీఆర్డీఓ కిరణ్కుమార్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.