నల్లగొండ ప్రతినిధి, జూన్11(నమస్తే తెలంగాణ) : ‘నల్లగొండను నాశనం చేసింది మీరే.. మీ నాయకత్వంలో లక్షలాది మంది ప్రజల ఎముకలు గూళ్లయ్యాయి.. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి.. కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ ఎందుకు క్షమాపణ చెప్పాలి? మీరు పుట్టించి, పోషించి లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న ఫ్లోరైడ్ను ఆరేండల్లోనే తరిమేసినందుకా.. 1970 తర్వాత జిల్లాలో ఫ్లోరైడ్ పుట్టింది.. మీ పాలనలో జిల్లా అంతటా విస్తరించింది.. ఒక్కనాడైనా దీనిపై మాట్లాడేందుకు మీ ఆంధ్ర యజమానుల వద్ద నోరు పెకిలిందా? మంచినీళ్లు ఇద్దామని ఆలోచన చేశారా? ఇదే కేసీఆర్ ఉద్యమ సమయంలో ఊరూరా తిరిగి ప్రజలకు ధైర్యం చెప్పి తెలంగాణ వచ్చిన ఆరేండ్లల్లోనే మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ను పారదోలింది నిజం కాదా.. ఇది పార్లమెంట్లో కేంద్ర మంత్రి చెప్పిందే కదా.. సమైక్య పాలనలో ప్రజల కష్టాలకు, సమస్యలకు కాంగ్రెస్ పార్టీ నేతలే లక్షసార్లు క్షమాపణలు, వేల సార్లు ముక్కులు నేలకు రాయాల్సి ఉంటుంది’ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు.
పదవుల కోసం పెదవులు మూసుకుని రాష్ర్టాన్ని, జిల్లాను సర్వనాశనం చేసిన భట్టి విక్రమార్క, జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి లాంటి వాళ్లంతా గురివింద సామెతలు చెబితే జిల్లా ప్రజలు సహించబోరని హెచ్చరించారు. పార్టీలో కుర్చీ పోరు కోసం యాత్రలు చేస్తున్న నేతలంతా కేసీఆర్ను తిట్టడమే తప్ప ప్రజలకు ఏమి చేస్తామో చెప్పకపోవడం విడ్డూరమన్నారు. ధరణి రద్దు చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు, దమ్ముంటే 24 గంటల ఉచిత కరంటు, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లను కూడా రద్దు చేస్తామని ప్రకటించాలని సవాల్ చేశారు. పైరవీలకు, అక్రమాలకు అలవాటు పడిన కాంగ్రెస్ నేతలకు ప్రతి పైసా నేరుగా ప్రజలకు చెందడం నచ్చడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతల రద్దు ప్రకటనలు చూస్తుంటే తమ పాతకాలం నాటి పద్ధతులతో తిరిగి ప్రజల సొమ్మును దోచుకువడమే తమ లక్ష్యమన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఆదివారం నల్లగొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్రావు, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భగత్కుమార్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులతో కలిసి మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
వ్యవసాయంపై మాట్లాడేందుకు సిగ్గుండాలి
కాంగ్రెస్ హయంలో వరిసాగుకు, నీటి విడుదలకు, ఆనాటి ధాన్యం సేకరణకు.. నేటి ధాన్యం సేకరణకు లెక్కలు తీసేందుకు మీరు సిద్ధంగా ఉండాలి.దీనిపై చర్చించేందుకు జానారెడ్డిని ఆరు సార్లు గెలిపించిన సాగర్లోని రాజవరం వెళ్దామా? ఎడమ కాల్వపై మొదటి మేజరైన రాజవరానికి 50 ఏైండ్లెనా నీళ్లు ఇచ్చారా అని మంత్రి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ వచ్చాకనే కదా నీళ్లు వచ్చినయ్ అన్నారు. ఉత్తమ్కుమార్రెడ్డి హయంలో ఏనాడైనా సాగర్ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీళ్లు ఇచ్చారా… ఇస్తే ఆ పొలాల్లో చర్చ చేద్దామా చెప్పాలని కోరారు. కృష్ణా నీళ్లన్ని ఆంధ్రకు తీసుకొపోతుంటే పదవుల కోసం పెదవులు మూసుకొని ఇవ్వాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మబోరన్నారు. కాకతీయుల కాలం నాటి చెర్వుల్లో సైతం ఏనాడూ పిడికెడు మట్టి తీయకుండా చెర్వులను ధ్వంసం చేశారని ఆరోపించారు. వ్యవసాయం గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ నేతలకు సిగ్గు లేదంటూ… ఒక్క ఏడాదైనా లాఠీదెబ్బలు లేకుండా విత్తనాలు దొరికాయా.. పోలీస్ స్టేషన్లలో కాకుండా ఎరువులు దొరికాయా? అని ప్రశ్నించారు. ఆనాడు నాలుగు లక్షల టన్నుల ధాన్యం పండలేదు… కానీ నేడు 40 లక్షల ధాన్యంతో దేశానికే నల్లగొండ జిల్లా అన్నపూర్ణగా మారిందని చెప్పారు. మూసీ కాల్వలపై ఒక్క రూపాయైన ఖర్చు చేశారా.. పంట దిగుబడులు రానిదే… ప్రతి పంటకు రెండు వేల కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి? ఈ సీజన్లో సైతం యాసంగిలో 10 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. మీ హయంలో రెండు లక్షల సాగు అయ్యిందా అని ప్రశ్నించారు.
కరంట్పై సమాధానం చెప్పాలి.
విద్యుత్ గురించి మాట్లాడడానికి భట్టీకి సిగ్గుండాలి. 2014 జూన్ 2న కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే ఏడాది నవంబర్లోనే కదా… వ్యవసాయం మినహా అన్ని రంగాలకు నిరంతరం విద్యుత్ ఇచ్చింది. కాంగ్రెస్ పాలనలో చేపట్టిన ఏ ప్రాజెక్ట్ దీనికి దోహదపడిందో భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలన్నారు. తొలి ఏడాదే 7 గంటలు, రెండేండ్లు తిరిగే వరకు 9 గంటలు, 2018 జనవరి నుంచి నేటి వరకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్రంలో ఇస్తున్న కరెంట్ ఘనత నిజంగా మీదైతే…. నేటికీ కాంగ్రెస్ పాలనలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ఘడ్లో 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వడం లేదు? తెలంగాణతో వాటిని ఎందుకు పోల్చి చెప్పడం లేదు? 24 గంటల కరెంట్ మీ చలువే అయితే… మీ గత 60 ఏండ్ల పాలనలో ఎందుకు ఇవ్వలేకపోయారు. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించే దమ్ము ధైర్యం కాంగ్రెస్ నేతలకు ఉందా అని ప్రశ్నించారు.
నీళ్లపై ఎక్కడ చర్చ చేద్దాం?
జిల్లాలో సాగునీళ్లే ఇవ్వకపోతే… వరిసాగే కాకపోతే… వరుసగా మూడేండ్లు దేశంలోనే అత్యధిక వరిసాగు చేసిన జిల్లాగా నల్లగొండ ఎలా నిలిచిందో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని మంత్రి నిలదీసారు. కాళేశ్వరం తొలి ఫలితం పొందిన సూర్యాపేట జిల్లా ఇవ్వాళ దేశానికే ఆదర్శం. మీ సమైక్య పాలనలో సూర్యాపేట నాశనమైంది. ఒకప్పుడు ధరల నిర్ధ్దారణలో సూర్యాపేట మార్కెట్ ప్రసిద్ధి. కానీ మీ పాలనలో దాన్ని తెరమరుగయ్యేలా చేశారు. కానీ నేడు కాళేశ్వరంతో పంటల దిగుబడుల్లో రికార్డులు సృష్టిస్తోంది. అందుకే ఇటీవల లక్ష మందికి పైగా ప్రజలు గోదావరి నీళ్లకు హారితి ఇచ్చారని గుర్తు చేశారు. దీనిపై ఉత్తమ్కుమార్రెడ్డి జాన్పహాడ్లో చేద్దామా? జానారెడ్డి రాజవరంలో చేద్దామా? లేదా సబ్స్టేషన్లో కూర్చుని కరెంటు గురించి చర్చలు చేద్దామా? సమాధానం చెప్పాలన్నారు.
తొండ ఉరుకుల కాంగ్రెస్ నేతలు
పార్టీలో పోరు కోసం కాంగ్రెస్ నేతలు ఉరుకులు పెడుతున్నారు. ప్రజల కోసం కాకుండా పార్టీ కుర్చీ కోసం పోరు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఉరుకులు తొండ ఉరుకులే. తొండ ఉరుకులు ఎనుగు(ముళ్లకంచె) వరకే తప్ప ఇంకోటి కాదు. తెలంగాణ ప్రజలు స్పష్టంగా కేసీఆర్ వెంటే ఉన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భట్టీ పాల్గొనాలి. పెన్షన్దారుడు, కల్యాణలక్ష్మి పొందిన కుటుంబం, రైతుబంధుతో వ్యవసాయం చేస్తున్న రైతుల మాటలు వినాలి. ఇవి వింటే మీకు వేరే చర్చలు… సమాధానాలు అవసరం ఉండదు. అప్పుడు మీరు చెప్పాలి క్షమాపణలు లక్ష సార్లు. మీరే ముక్కు నేలకు రాయాలి వేల సార్లు. ఇది ప్రజల డిమాండ్… ఫ్లోరైడ్ బాధితుల పక్షాన నా డిమాండ్ అని జగదీశ్రెడ్డి సీరియస్గా స్పందించారు.
గోబెల్స్కు మించి అబద్ధాలు
ఒక అబద్దాన్ని వందసార్లు చెప్పి నిజం చేద్దామనుకున్న గోబెల్స్ను మించి కాంగ్రెస్ నేతలు ఒక అబద్దాన్ని వెయ్యి సార్లు ప్రచారం చేద్దామనుకుంటున్నారని మంత్రి విమర్శించారు. అందుకే తాము స్పందించాల్సి వస్తుందని, నల్లగొండ జిల్లా ప్రజల తరుపున, ఫ్లోరైడ్ బాధితుల తరుపున మాట్లాడుతున్నామన్నారు. ఈ దరిద్రానికి 60 ఏండ్లు పాలించిన మీరే కారణం. పదవి లేకపోతే ఉండలేరు. ప్రజలు అన్ని ఆలోచించే మిమ్మిల్మి రాజకీయ నిరుద్యోగులుగా మార్చారు. మీ ఉద్యోగాల కోసం ఇప్పుడు ఏడుస్తున్నారు. క్షమాపణ చెప్పేందకు సిద్ధంగా ఉండాలి. చేసిన తప్పులు తెలుసుకొని భట్టి విక్రమార్క మాట్లాడాలి. సీఎం కేసీఆర్ను తిట్టేందుకే యాత్రలు తప్పా… ప్రజల కోసం కాదని మంత్రి జగదీశ్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంపైనా కుట్రలే
వైఎస్ రాజశేఖర్రెడ్డి జిల్లాకు తీరని ద్రోహం చేస్తూ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ఎక్కడా లేని టెక్నాలజీతో కుట్రలు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. దుర్మార్గమైన టెక్నాలజీతో పర్యావరణ అనుమతులు క్లిష్టమైన తెలిసి నల్లగొండకు నీళ్లు త్వరగా పోవద్దని, అప్పటి వరకు ఆంధ్రా ప్రాంతానికి నీళ్లను తరలించుకుపోయేలా కుట్రలు సాగాయని గుర్తు చేశారు. ఇవన్నీ పక్కన పెట్టి తెలంగాణకు ద్రోహం చేస్తూ రాష్ట్రం రాకుండా అడ్డుపడిన రాజశేఖర్రెడ్డిని కాంగ్రెస్ నేతలు నెత్తిన పెట్టుకోవడం దేనికి సంకేతం అన్నారు. సాగర్లో ఎపుడైనా వరుసగా రెండు పంటలకు నీరిచ్చారా.. నీళ్లు కృష్ణాడెల్టాకు తీసుకు వెళ్తుంటే కళ్లప్పగించి చూశారన్నారు. కానీ నేడు వరుసగా 16వ పంటను పండించుకున్నారు.. ఈ విషయమై సాగర్ రైతాంగం వద్దకు చర్చకు వెళ్దామా అని సవాలు చేశారు.