‘ఇచ్చిన ప్రతి హామీని ఆచరణలో చేసి చూపాం. ఇంతకుముందు ఎన్నడూ చెప్పనివి సైతం ప్రజా అవసరాల రీత్యా చేశాం. 2014లో ఇచ్చిన మాట ప్రకారం సూర్యాపేటను జిల్లా చేశాం. 2018 కంటే ముందు చెప్పిన విధంగా అద్భుతంగా కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం చేసుకున్నాం. అస్సలే ఊహించవి విధంగా సీఎం కేసీఆర్ వరంగా ఇచ్చిన మెడికల్ కాలేజీని పూర్తి చేసుకున్నాం. ఇలా ఎన్నో అభివృద్ధి పనులకు సూర్యాపేట వేదికగా నిలిచింది. ఎవ్వరూ ఊహించని ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అంకితం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 20న సూర్యాపేటకు వస్తున్నారు.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి వెల్లడించారు. ఆదివారం సీఎం కేసీఆర్ సూర్యాపేటకు రానున్న సందర్భంగా నమస్తే తెలంగాణతో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్కు ఘనంగా స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రజలు పెద్ద ఎత్తున సన్నద్ధమవుతున్నారని తెలిపారు. లక్షలాది మంది ప్రజలతో బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు రాజకీయ సందేశం కూడా ఇస్తారని మంత్రి వివరించారు.
– నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ)
జిల్లాగా మారిన సూర్యాపేట ఎన్నో అభివృద్ధి పనులకు వేదికగా నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి వెల్లడించారు. సుమారు 36వేల కోట్ల రూపాయలతో ఎవరూ ఊహించని అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. ఈ క్రమంలో పలు ప్రారంభోత్సవాలు చేసేందుకు ఆదివారం సూర్యాపేటకు వస్తున్న అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘనంగా స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రజలు పెద్ద ఎత్తున సన్నద్ధమవుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా నమస్తే తెలంగాణకు మంత్రి జగదీశ్రెడ్డి శుక్రవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
– నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ)
నమస్తే : సీఎం కేసీఆర్ సూర్యాపేట పర్యటన ఉద్దేశం ఏంటి?
మంత్రి : స్వరాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్తో అభివృద్ధి, సంక్షేమానికి బాటలు వేశారు. అందులో భాగమే సూర్యాపేట జిల్లా ఏర్పాటు కూడా. జిల్లాగా ఏర్పాటు చేయడమే కాదు.. సమగ్ర అభివృద్ధికి ఆదేశించారు. రూ.36వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. కొత్త జిల్లాలో అద్భుతంగా కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయ నిర్మాణాలు జరిగాయి. ప్రజల సౌకర్యార్థం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తి చేశాం. సూర్యాపేటకే తలమానికంగా మెడికల్ కాలేజీ రూపుదిద్దుకున్నది. ఇలాంటి గొప్ప అభివృద్ధి పనులన్నీ ప్రజలకు అంకితం చేసేందుకే సీఎం కేసీఆర్ సూర్యాపేటకు వస్తున్నారు.
నమస్తే : పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగ సభ లక్ష్యం ఏంటి?
మంత్రి : ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించింది. చరిత్రలో తొలిసారి 12 అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్వే. ఇలాంటి పార్టీకి కొత్త జిల్లాల వారీగా ఆఫీసుల నిర్మాణం జరుగుతుంది. సూర్యాపేటలోనూ పార్టీ కార్యాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను తలపెట్టాం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయంగా ప్రజలకు సీఎం కేసీఆర్ సందేశం ఇవ్వనున్నారు. పార్టీ శ్రేణులకూ దిశానిర్దేశం చేయనున్నారు.
నమస్తే : ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా కీలకమైన ప్రకటనలు ఆశించవచ్చా?
మంత్రి : ఇది ఎన్నికల సందర్భంగా జరుగుతున్న సభ కాబట్టి కచ్చితంగా దేశ, రాష్ట్ర రాజకీయాలపై సీఎం కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. బీజేపీ వల్ల దేశం ఏ విధంగా నష్టపోతుంది. చట్టబద్ధ సంస్థల దుర్వినియోగం, ప్రత్యర్థి పార్టీలపై కుట్రలు, రాష్ర్టాల హక్కుల అణిచివేత, రాష్ర్టాల అభివృద్ధికి కేంద్ర సర్కార్ అడ్డుకట్ట వంటి అంశాల ప్రస్తావన ఉండొచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణకు ఏ రకంగా నష్టం, జరుగుతున్న అభివృద్ధిపై చేస్తున్న కుట్రలను, ప్రాజెక్టులకు మోకాలడ్డుతున్న వైనాన్ని, ఇలా అనేక అంశాలపైనా ప్రజలకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో తమ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే తలమానికంగా నిలుస్తున్న తీరు, తెలంగాణ అద్భుత ప్రగతిని, భవిష్యత్తు విజన్ను కూడా ప్రజలకు సీఎం కేసీఆర్ వివరిస్తారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల కర్తవ్యం ఏంటో తెలియజేస్తారు.
నమస్తే : సభకు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది?
మంత్రి : సీఎం రాక కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లక్షలాదిగా తరలివచ్చి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఎటు చూసినా అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నాయి. సూర్యాపేటకు పడమర వైపు ఎస్పీ ఆఫీస్, తూర్పున కలెక్టరేట్, మధ్యలో అద్భుతమైన మెడికల్ కాలేజీ, ఆ పక్కనే సకల హంగుల సమీకృత మార్కెట్ ఇలా.. నలుదిక్కులా అభివృద్ధి జరుగుతుంది. ఇక సాగు, తాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం వంటి మౌళిక వసతుల కల్పన పూర్తయింది. సంక్షేమ పథకాలతో అందరికీ లబ్ధి జరుగుతున్నది. వీటన్నింటికీ మూలమైన సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు జనం సిద్ధమవుతున్నారు. సూర్యాపేట పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పాదయాత్రల ద్వారా సభకు రానున్నారు. గ్రామాలకు గ్రామాలు తరలి రావాలని స్వచ్ఛందంగా తీర్మానాలు చేసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. సూర్యాపేట జిల్లా నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి రానున్నారు.
నమస్తే : బహిరంగ సభ ఏర్పాట్లు, ఇతర అంశాలు ఎలా ఉన్నాయి?
మంత్రి : సూర్యాపేట పట్టణంలో కొత్త మార్కెట్కు దగ్గరలో హైవేకు ఆనుకుని విశాలమైన ప్రదేశంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. అందరూ సులభంగా, నాలుగు వైపులా సభాస్థలికి చేరుకోవచ్చు. విశాలమైన పార్కింగ్ సౌకర్యం కూడా ఉన్నది. వర్షం వచ్చినా ఇబ్బంది ఉండదు. మధ్యాహ్నం 2 గంటల వరకు అందరూ సభాస్థలానికి చేరుకోవాలి. అంతకుముందు సీఎం కేసీఆర్ నేరుగా మెడికల్ కాలేజీ ఆవరణకు చేరుకుంటారు. ముందుగా మెడికల్ కాలేజీ భవనం, తర్వాత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జిల్లా పోలీసు కార్యాలయ భవనం, తర్వాత బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఓపెన్ చేస్తారు. చివరగా జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ భవనాన్ని ప్రారంభిస్తారు. అక్కడే జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో మీటింగ్ అనంతరం మధ్యాహ్న భోజనం ఉంటుంది. లంచ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది.
నమస్తే : రుణమాఫీ అనంతరం సభ కదా.. రైతుల స్పందన ఎలా ఉంది?
మంత్రి : కేసీఆర్ది రైతు ప్రభుత్వం అనేది ప్రతి ఒకరికీ తెలుసు. రుణమాఫీ హామీ అమలు జరుగదేమో.. దీన్ని అడ్డం పెట్టుకుని నాలుగు ఓట్లు పొందొచ్చని ప్రతిపక్షాలు ఆశించాయి. కానీ.. వారి ఆశలన్నీ పటాపంచలు చేస్తూ ఇచ్చిన మాట మేరకు రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దాదాపు 50శాతం మందికి పూర్తయింది. మిగతాది త్వరలోనే పూర్తి కానుంది. అడకుండానే ఇచ్చిన రైతు బంధు, చెప్పి ఇచ్చిన రుణమాఫీ, ఆపదలో ఆదుకునే రైతు బీమా, ఇబ్బంది లేకుండా విత్తనాలు, ఎరువుల సరఫరా.. సబ్సిడీలతో పంటలకు ప్రోత్సాహం, ప్రతి ఎకరాకు సాగునీరు, ఉచిత కరెంటు.. ఇలాంటి పథకాలతో సీఎం కేసీఆర్ రైతుల హృదయాల్లో నిలిచిపోయారు. రైతాంగమంతా కేసీఆర్ వెంటే ఉన్నది. అందుకే రైతులంతా స్వచ్ఛందంగా సొంత వాహనాల్లో తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.