యాదగిరిగుట్ట, జూలై 13 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో గురువారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్వామివారికి లక్ష పుష్పార్చన శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన చేశారు. సుమారు రెండు గంటలపాటు కొనసాగింది. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు.
అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణ తంతు జరిపారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్ర నామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం స్వామివారికి వెండి మొక్కు జోడు సేవ, దర్బార్ సేవ వైభవంగా చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 10వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.16,84,957ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గురువారం అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సతీమణి ఉషా దయాకర్రావుతో కలిసి యాదగిరిగుట్టకు చేరుకొని లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారి మంత్రికి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కృషితో యాదగిరిగుట్ట క్షేత్రం గొప్ప దైవక్షేత్రంగా విరాజిల్లుతుందని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి, ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. సీఎం కేసీఆర్ కుటుంబం బాగుండాలని, ఆయన తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని నరసింహస్వామిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.