తిరుమలగిరి ఏప్రిల్ 26 : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో దళారులు రైతులను నిండా ముంచుతున్నారు. మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన దళారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మకై ఎక్కువ ధరకు ఐకేపి ,పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించి లాభాలు గడిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోక పోవటంతో వీరి దందా మండలాలు దాటుతోంది.
రాత్రి వేళల్లో ఈ దందా జోరుగా కొనసాగుతున్నది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వరి కోతలు పూర్తి కావడంతో స్థానిక వ్యవసాయ మార్కెట్కు అధికంగా ధాన్యం వస్తోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ఆలస్యం కావటం ,ప్రతి చిన్న విషయానికి కొర్రీలు పెడుతుండటంతో రైతులు తక్కువ ధరకే మార్కెట్లో అమ్ముకుంటున్నారు. రైతులు అవసరాలను ఆసరాగా తీసుకొని కొంత మంది వ్యాపారులు, దళారులు తక్కువ ధరకే ధాన్యా న్ని కొనుగోలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో తుంగతుర్తి మండలంలోని గొట్టిపర్తి, వెంపటి తదితర ప్రాంతా ల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో చేతులు కలిపి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.
గట్టు చప్పుడు కాకుండా దందా..
ప్రతిసీజన్లో కొంతమంది వ్యాపారులు కొన్ని సం వత్సరాలుగా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో ఈ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. మార్కెట్ యార్డులో గతంలో వ్యాపారులు, దళారులు రైతుల వద్ద కందులు తక్కువ ధరకే కొనుగోలు చేసి మార్కెట్ యార్డులోని హాకా కందుల కొనుగోలు కేంద్రంలో మద్దతు ధరకు అమ్మిన సందర్భాలూ ఉన్నాయి. తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయటం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ ధరకు అమ్మటం పరిపాటిగా మారింది.
వ్యాపారులు, అధికారులతో కుమ్మక్కై ఈ దందా సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ట్రాక్టర్కు రూ.20 వేల నుంచి రూ 25 వేల వరకు లాభం వస్తుంటంతో ప్రతిరోజు 5 నుంచి10 ట్రాక్టర్ల వరకు ధాన్యాన్ని మార్కెట్ నుంచి కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం, దీనితో ప్రభుత్వ ఆదాయానికి గంటి పడటమే కాకుండా ప్రభుత్వం రైతులకు అందిస్తున్న మద్దతు ధరను దళారులు, వ్యాపారులు కాజేస్తున్నారు. ఈ దందాపై అధికారులు క్షేత్ర స్థాయి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

క్వింటా.. 15 వందలకు కొనుగోలు
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర క్విం టాకు ఏ గ్రేడ్ ధాన్యం రూ. 2,389, బీగ్రేడ్ ధాన్యం రూ. 2,369గా నిర్ణయించింది. అయితే తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్కు జనగాం ,మహబూబా ద్ , యాదాద్రి భువనగిరి ,తో పాటు తిరుమలగిరి మండలాల నుంచి పెద్దమొత్తంలో ధాన్యం తెచ్చి విక్రయిస్తున్నారు. మార్కెట్కు భారీగా ధాన్యం రావటంతో దళారులు, వ్యాపారులు, రైతులకు క్వింటాకు రూ. 1500 నుంచి రూ .1600కే కొనుగోలు చేస్తున్నారు. ధాన్యాన్ని ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీల్లో అర్ధరాత్రి వేళల్లో ప్రభుత్వ కొనుగోలు కేం ద్రాలకు తరలిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కాం టాలు ప్రారంభం కాకున్నా సదరు దళారులు ముం దస్తుగానే కేంద్రాలకు తరలిస్తున్నారు. కొంత మం ది రైతుల పేరుతో ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయిస్తూ క్వింటాకు రూ.700 నుంచి రూ.800 వరకు లాభం పొందుతున్నారు.