మునుగోడు, అక్టోబర్ 27 : మధ్యాహ్న భోజనం పథకంలో పని చేస్తున్న కార్మికులకు పెండింగు బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) నల్లగొండ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ, సిఐటియూ మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మునుగోడు మండల కేంద్రం ఎర్ర గోపాల్ మీటింగ్ హాల్లో నీరుడు రాజ్యలక్ష్మి అధ్యక్షతన మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న కార్మికులకు పాఠశాలల ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎలాంటి బిల్లులు, వేతనాలు అందలేదని, దసరా పండగ రోజు కూడా తమ కుటుంబాలను పస్తులించిన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నెలల తరబడి బిల్లులు, వేతనాలు రాకపోతే ఎలా వంట వండి పెడతారని ప్రశ్నించారు. వెంటనే పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల ముందు కార్మికులకు రూ.10 వేల వేతనం ఇస్తామన్న వాగ్దానాన్ని అమలు చేసి కార్మికుల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. కార్మికులను కొత్త మెనూ పేరుతో ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీలు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఇది సరైన పద్ధతి కాదన్నారు. బిల్లులు సకాలంలో వచ్చినా, రాకపోయినా ఎవరెన్ని ఇబ్బందులకు గురిచేసినా విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలను పెంచాలని, అంగన్వాడీ కేంద్రాల మాదిరిగా గుడ్లు సరఫరా ప్రభుత్వమే చేయాలన్నారు. వంటకు సరిపడా గ్యాస్ను ప్రభుత్వమే పూర్తి ఉచితంగా ఇవ్వాలని, కాటన్ దుస్తులు యూనిఫామ్ గా ఇవ్వాలని, కనీస వేతనం ర.26 వేలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల కార్యదర్శి గంగుల దమయంతి, భయ్యా మహేశ్వరి, ఏకొండ మల్లమ్మ, బోయినపల్లి సత్తెమ్మ, జినకల లక్ష్మమ్మ, బొలుగూరి భిక్షమయ్య పాల్గొన్నారు.