నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 26 : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో 13 వేల మందికి ఉద్యోగ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చామని, సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సోమవారం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్),ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎంజీయూ అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించిందన్నారు.
ఎంజీయూలో ఖాళీల భర్తీని సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానన్నారు. యువత ఎంప్లాయ్గానే కాకుండా ఎంప్లాయ్ క్రియేటర్గా ఎదుగాలని సూచించారు. చదువుకుంటేనే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని, తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలంటే ఉద్యోగం సాధించి పేదరికం నుంచి బయటపడాలని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని ఉద్యోగాన్ని సాధించి టాలెంట్ నిరూపించుకోవాలని, తన కూతురు కూడా జాబ్ సంపాదించుకున్నాక మరో 150 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగిందని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా వివిధ కంపెనీలతో జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగం పొందిన వారికి రూ. 10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ప్యాకేజీ ఉందని తెలిపారు. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే యువతకు ప్రతీక్ ఫౌండేషన్ అధ్వర్యంలో ఉచితంగా మెటీరియల్ పంపిణీ చేస్తామన్నారు. ఎంజీ యూనిర్సిటీని తెలంగాణలోనే బెస్ట్ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతానని చెప్పారు.
ఈ జాబ్ మేళాకు 12 వేల మంది యువత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, 127 కంపెనీలు 12,733 ఉద్యోగాలు కల్పించనున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎస్పీ చందనా దీప్తి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎంజీయూ వైస్ చాన్స్లర్ గోపాల్రెడ్డి, రిజిస్ట్రార్ ఆల్వాల రవి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, ప్లేస్మెంట్ అధికారి ప్రశాంతి, టాస్క్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.