ఇప్పటికే ల్యాబ్ సిబ్బంది నియామకం పీహెచ్సీలు, సీహెచ్సీలకు అనుసంధానం జిల్లా నలుమూలల నిత్యం ప్రత్యేక వాహనాల్లో శాంపిల్స్ సేకరణ నేడు వర్చువల్గా ప్రారంభించనున్న వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
యాదాద్రి భువనగిరి, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం టీ హబ్ (టీ డయాగ్నస్టిక్)లను ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు టీ హబ్ను మంజూరు చేసింది. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని కేంద్ర ఆస్పత్రిలో రూ.1.25 కోట్లతో విశాల భవనం నిర్మించింది. అంతకుముందు ఇక్కడ ఫార్మసీ స్టోర్ ఉండేది. కొత్త బిల్డింగ్లో అధునాతన ల్యాబ్ను ఏర్పాటు చేశారు. టీ హబ్ సెంటర్లలో గతంలో 60 రకాల వైద్య పరీక్షలు మాత్రమే చేసేవారు. ఇప్పుడు మన దగ్గర మొత్తం 134 పరీక్షలను ఉచితంగా చేయనున్నారు. బయో కెమిస్ట్రీకి సంబంధించి 56 పరీక్షలు, పాథాలజీకి చెందినవి 37, మైక్రోబయాలజీకి సంబంధించి 41పరీక్షలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా ఈసీజీ, ఆల్ట్రాసౌండ్, మమ్మోగ్రామ్, టూడీ ఎకో, ఎక్స్రే పరీక్షలు చేపట్టనున్నారు. ఇక ల్యాబ్ సిబ్బందిని సైతం నియమించనున్నారు. పీహెచ్సీలలో అదనంగా ఉన్న స్టాఫ్ను టీ హబ్కు ఎటాచ్ చేశారు.
పీహెచ్సీలకు అనుసంధానం
ప్రస్తుతం టీహబ్ సెంటర్లలో నమూనాలు ఇచ్చిన వారికే పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం రోగనిర్ధారణ పరీక్షలను విస్తరించింది. జిల్లా కేంద్ర ఆస్పత్రితోపాటు జిల్లాలోని 21 పీహెచ్సీలు, 3 సీహెచ్సీలకు టీ హబ్ను అనుసంధానం చేస్తారు. టీ హబ్లోనే కాకుండా పీహెచ్సీలు, సీహెచ్సీల్లో నమూనాలు ఇచ్చిన వారికి కూడా పరీక్షలు చేయనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే సిబ్బంది శాంపిల్స్ సేకరిస్తారు. అక్కడి నుంచి రోజువారీగా టీ హబ్కు పంపిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు వాహనాలను కూడా సిద్ధం చేశారు. ఐదారు పీహెసీలకు ఒక రూట్ను రూపొందించారు. ప్రతి రోజూ నాలుగు రూట్లలో వెళ్లి.. పీహెచ్సీల నుంచి శాంపిల్స్ను సేకరించి టీ హబ్కు తీసుకొస్తారు. ఇక్కడ సిబ్బంది రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి.. ఫలితాలను వెంటనే ఆన్లైన్లో పంపిస్తారు. పేషెంట్ రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్కు వివరాలు వెళ్తాయి.
తగ్గనున్న ఆర్థిక భారం
మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో అన్ని రకాల పరీక్షలు అందుబాటులో లేవు. కాస్త పెద్ద పరీక్షలకు హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్లు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. కొన్ని ఆస్పత్రులు అవసరం లేకున్నా టెస్టులు రాస్తున్నాయి. దీంతో సామాన్యులు ప్రైవేట్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలంటే ఆస్తులు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. వేలకు వేలు దోచుకుంటున్నాయి. దీంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనుండటంతో సామాన్యులకు ఎంతో మేలు జరుగనుంది. పేదల ల్యాబ్ అందుబాటులోకి రానుండటంపై జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.