కట్టంగూర్ : అవధులు లేని ఆశలతో, డాక్టరై సమాజానికి సేవ చేయాలన్న ఆశయంతో అడుగులు వేసిన ఓ వైద్య విద్యార్థిని.. వేధింపుల భారం మోయలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ వార్త సృష్టించిన ప్రకంపనల నుంచి తేరుకోకముందే.. సదరు వేధింపులకు కారణమైన యువకుడు సైతం భయంతో తండ్రి సమాధిపై రక్తంతో పేర్లు రాసి, ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువతీ, యువకుడు ఒకే రోజు ఆత్మహత్యలకు పాల్పడటంతో నల్లగొండ( Nalgonda ) జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వేధింపులు భరించలేకే..

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మునుకుంట్ల గ్రామానికి చెందిన సుక్క లింగయ్య,
యాదమ్మ దంపతుల చిన్న కుమార్తె లక్ష్మీ ప్రసన్న( Laxmi Prasanna ) (21) సూర్యాపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. కన్నవారి కలలను నిజం చేస్తూ డాక్టర్ చదువుతున్న లక్ష్మీ ప్రసన్నను, అదే గ్రామానికి చెందిన చిలుముల రామ్ చరణ్ (25) గత కొంతకాలంగా ‘ప్రేమిస్తున్నాను’ అంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు.
పలుమార్లు లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు రామ్ చరణ్ ను మందలించిన అతనిలో మార్పు రాలేదు. రామ్ చరణ్ పెట్టే మానసిక క్షోభను, వేధింపులను తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మీ ప్రసన్న శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయం లో ఇంటి పై భాగంలోని ఇనుప పైపునకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తండ్రి సమాధి వద్ద యువకుడి బలవన్మరణం
తన వేధింపుల వల్లే లక్ష్మీ ప్రసన్న ప్రాణాలు కోల్పోయిందనే విషయం రామ్ చరణ్కు తెలియడంతో అతను తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. పోలీసు కేసు, సమాజానికి ఏం సమాధానం చెప్పాలనే భయంతో శుక్రవారం రాత్రి గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన తన తండ్రి నర్సింహ సమాధిపై తన రక్తంతో తన పేరును, (లక్ష్మీ ప్రసన్న నిక్ నేమ్) చిన్నారి అనే పేరును రాశాడు. అనంతరం పక్కనే ఉన్న తాటిచెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
ఆసుపత్రికి మృతదేహాలు.. గ్రామంలో పోలీసు బందోబస్తు
ఒకేరోజు ఇద్దరు యువతీ, యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత, విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి లక్ష్మీ ప్రసన్న మృతదేహానికి, శనివారం ఉదయం చరణ్ మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం కోసం లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని శుక్రవారం రాత్రి నల్లగొండ, రామ్ చరణ్ మృత దేహాన్ని శనివారం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాలిగౌరారం సీఐ రాజశేఖర్, కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
లక్ష్మీ ప్రసన్న తండ్రి లింగస్వామి ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్నత విద్యతో వైద్యురాలిగా ఎదగాల్సిన కుమార్తె అకాల మరణం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. మరోవైపు ఇప్పటికే తండ్రిని కోల్పోయిన రామ్ చరణ్ కుటుంబంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి అక్క లక్ష్మి ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని చేస్తున్నట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు.