దామరచర్ల, ఫిబ్రవరి 1 : మండలంలోని గిరిజన తండాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. తండాలు, గ్రామాల్లో దోమల బెడదతోపాటు వాతావరణ కాలుష్యం కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు దగ్డు, జలుబు, టైఫాయిడ్, మలేరియా జ్వరాల బారిన పడుతున్నారు. మండలంలోని మూసీ పరీవాహక తండాల్లో విషజ్వరాలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో మండలంలోని జేత్రాంతండాలో 70 మందికి పైగా విషజ్వరాల బారిన పడ్డారు.
స్థానిక ఎంపీటీసీ వాలీ ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో మండల వైద్యాధికారి నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో తండాలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. రక్త పరీక్షలు చేసి జ్వరాలు అదుపులోకి రాని వారిని 20 మందిని మండల పీహెచ్సీకి తరలించారు. తండాలో ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందజేస్తున్నామని, జ్వరాలు అదుపులోకి వచ్చే వరకు తండాలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పంటలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న క్రమంలో విష జ్వరాలు మరింత కుంగదీస్తున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండాలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, అపరిశుభ్రత లేకుండా చూడాలని కోరుతున్నారు.