సూర్యాపేట, ఏప్రిల్ 11 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు మండి పోతున్నాయి. ఏప్రిల్లోనే మేను తలపించేలా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మంగళవారం ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో ఒకే రోజు 3 డిగ్రీలు పెరిగి 42.4 డిగ్రీలుగా నమోదవగా నల్లగొండ జిల్లాలో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ప్రథమ స్థానంలో ఉండగా నల్లగొండ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 40.7 డిగ్రీలుగా నమోదైంది.
అమాంతం పెరిగిన ఉష్ణోగతలు
సూర్యాపేట జిల్లాలో సోమవారం ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలుగా ఉండగా మంగళవారం ఒక్కసారిగా 3 డిగ్రీలు పెరిగి 42.4గా నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో కూడా సోమవారం 39.5 డిగ్రీలుగా నమోదవగా ఒక్క రోజులోనే 3 డిగ్రీల కంటే అధికంగా పెరగడంతో నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు వేడి గాలులు సైతం వీస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండగా ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. చల్లదనం కోసం పెద్ద ఎత్తున్న కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. వేడి నుంచి ఉపశమనం కోసం కొబ్బరి నీరు, జ్యూస్లపై ఆధారపడుతుండడంతో వాటిని విక్రయించే దుకాణాల్లో రద్దీ పెరిగింది.
యాదాద్రి జిల్లాలో
భువనగిరికలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం బొమ్మలరామారం మండలంలోని మర్యాలలో 40.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సైతం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బీబీనగర్లో 39.7 డిగ్రీలు, చౌటుప్పల్లో 39.7, వలిగొండలో 39.6, భువనగిరిలో 39.5, మోత్కూరులో 39.5, వలిగొండలో 39.3, రాజాపేటలో 38.8, రామన్నపేటలో 38.7, భూదాన్పోచంపల్లిలో 38.6, సంస్థాన్నారాయణపూర్లో 38.6, యాదగిరిగుట్టలో 38.3, గుండాలలో 38.2, ఆత్మకూర్(ఎం)లో 38.1, ఆలేరులో 38.1, మోత్కూరులో 37.7, అడ్డగూడూరులో 36.6 డిగ్రీల చొప్పున ఉష్ణాగ్రతలు నమోదయ్యాయి.