మఠంపల్లి, మే 5 : మండలంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన మట్టపల్లి లక్ష్మీనర్సింహ స్వామి తిరు కల్యాణోత్సవాన్ని అర్చకులు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్ర్తాలను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, రజిత దంపతులు సమర్పించి పీటలపై కూర్చుని కల్యాణతంతు జరిపించారు. కల్యాణోత్సవం సందర్భంగా స్వామివారికి పంచామృత స్నానం, మహాభిషేకం, గరుఢ వాహన సేవ, సాయంత్రం 6గంటలకు స్వామి వారి రధోత్సవం పూజా కార్యక్రమాలను యాజ్ఞికులు, బ్రహ్మశ్రీ బొర్రవాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కల్యాణానికి తెలంగాణ, ఏపీతో పాటు తమిళనాడు, చెన్నై ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. నృసింహుడి నామ సంకీర్తనతో మట్టపల్లి క్షేత్రం మార్మోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, మంచినీటి వసతి, వైద్య సదుపాయం కల్పించారు. స్థానిక సాగర్, నాగార్జున సిమెంట్స్ పరిశ్రమల ఆధ్వర్యంలో భక్తులకు మంచినీరు, మజ్జిగ, అల్పాహారం అందించారు. మట్టపల్లి క్షేత్రంలో గల వివిధ కుల సత్రాల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, వసతి సౌకర్యం కల్పించారు.
తిరు కల్యాణోత్సవాలకు రెండు తెలుగు రాష్ర్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో 200మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పకడ్బందీగా బందోబస్తు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్, ఎంపీపీ ముడావత్ పార్వతీకొండానాయక్, జడ్పీటీసీ జగన్నాయక్, సర్పంచ్ దాసరి విజయలక్ష్మీ వెంకటరమణ, మఠంపల్లి సర్పంచ్ మన్నెం శ్రీనివాస్రెడ్డి, ఆలయ పాలకమండలి సభ్యులు, అర్చకులు, పలు సత్రాల అధ్యక్షులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.