సూర్యాపేట/సూర్యాపేట రూరల్, మే 6 : జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సాయం త్రం నుంచి రాత్రి పది గంటల వరకు భారీగా ఈదురుగాలులు వీయడంతో 10 మండలాల పరిధిలో 447 మంది రైతులకు చెందిన 1,429 ఎకరాల్లో మామిడి కాయలు రాలినట్లు ఉద్యానవన అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు. ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. చేతికి వచ్చి అమ్ముకునే సమయంలో మామిడి కాయలు రాలడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరో నలుగురు రైతులకు చెందిన 17.5 ఎకరాల్లో అరటి పంట దెబ్బతింది.
సూర్యాపేట పరిధిలోని పిల్లలమర్రి, ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఎనుబాముల గ్రామంలో దెబ్బతిన్న మామిడి తోటలను జిల్లా ఉద్యానవన అధికారి అధికారి టి.నాగయ్య సోమవారం పరిశీలించారు. పంట నష్టం నివేదికను వ్యవసాయ, ఉద్యానశాఖ సిబ్బంది ద్వారా ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఆయన వెంట సూర్యాపేట ప్రాంతీయ ఉద్యానవన అధికారి జగన్ ఉన్నారు.