మన ఊరు -మనబడి కార్యక్రమం ఎంతో బాగుందని, ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని కేంద్ర ప్రభుత్వ బృందం ప్రశంసించింది. పబ్లిక్ రీడింగ్ లైబ్రరీలు ఏర్పాటు ఆకట్టుకున్నాయని తెలిపింది. జిల్లాలోని పోచంపల్లి మండలం భీమనపల్లి, ఆలేరు, భువనగిరి ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం పర్యటించిన కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ అమర్ ప్రీత్ దుగ్గల్, డిప్యూటీ సెక్రటరీ సుధా మీనా, సీనియర్ కన్సల్టెంట్ ఇంద్రజిత్ వస్తా ఈ కితాబునిచ్చారు.
భూదాన్ పోచంపల్లి, జూన్ 13 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంలో పాఠశాలలు సకల వసతులతో అద్భుతంగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ అమర్ప్రీత్ దుగ్గల్ కొనియాడారు. మంగళవారం ఆమె మండలంలోని బీమనపల్లి ప్రాథమికోన్నత, భూదాన్ పోచంపల్లి జడ్పీహెచ్ఎస్ను కేంద్ర విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీ సుధామీన, రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మ, కలెక్టర్ పమేలా సత్పతి, అడీషనల్ కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి సందర్శించారు. పాఠశాలలో లెర్నింగ్ మెటీరియల్, విద్యా బోధన, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన తరగతి గదుల నిర్మాణాన్ని పరిశీలించి సూల్ మేనేజ్మెంట్తో సమావేశమయ్యారు.
అనంతరం పాఠశాల విద్యార్థులతో విద్యా బోధన, వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో సరికొత్తగా తీర్చిదిద్దారని కొనియాడారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గ్రామ సర్పంచ్, పాఠశాల కమిటీ, ప్రజాప్రతినిధులు గ్రామస్తులందరూ కృషి చేయాలని కోరారు. పాఠశాల టాయిలెట్స్ మెయింటనెన్స్ కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఈఓ కే.నారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్యాదవ్, గ్రామ సర్పంచ్ కంటె రాములు, ఎంపీడీఓ బాలశంకర్, ఇన్చార్జి ఎంఈఓ నాగవర్దన్రెడ్డి, ఎంపీఓ మజీద్, ఎస్ఎంసీ చైర్మన్ నాంపల్లి వెంకటేశ్, ఆత్మ డివిజన్ కన్వీనర్ కందాల సుధాకర్రెడ్డి, టెక్నికల్ కన్సల్టెంట్ ఇంద్రజిత్ వత్స, ఆర్ఐ వెంకట్రెడ్డి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
భవిత కేంద్రం సందర్శన
ఆలేరు : పట్టణంలోని భవిత కేంద్రాన్ని కేంద్ర బృందం సభ్యులు మంగళవారం పరిశీలించారు. కేంద్రం నిర్వహణ, విద్యార్థుల హాజరు నమోదు పరిశీలనతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను పలు అంశాలపై ఆరా తీశారు. భవిత కేంద్రంలో అందుతున్న సేవలపై అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తంచేశారు.