– తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి
చండూరు, మే 06 : చండూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చండూరులో రైతులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడెం, గట్టుప్పల్ మండలాల్లో రైతులు అధిక సంఖ్యలో మొక్కజొన్న పంటను పండిస్తున్నప్పటికీ సరైన మార్కెట్ సౌకర్యాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రైతులు తమ పంటను తక్కువ ధరలకు దళారులకు అమ్ముకోవాల్సి వస్తుందని, ఇది రైతుల ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుతున్నదన్నారు.
కావున ఈ ప్రాంతంలో తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, మార్కెట్ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడ మార్కెట్ ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు కనీస మద్దతు ధర (MSP) లభించి, వారి కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని మార్కెట్లో తగిన తూకం యంత్రాలు, గిడ్డంగి సౌకర్యాలు, తక్షణ చెల్లింపుల వంటి సౌకర్యాలను కూడా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దోటి శ్రీను, జిల్లా సత్తయ్య, జక్కర్తి లక్ష్మయ్య, పిట్టల యాదయ్య పాల్గొన్నారు.