– పాల్గొన్న ఎస్ఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఎంఎస్ఎఫ్, పీడీఎస్యూ విద్యార్థి సంఘాలు
రామగిరి, ఏప్రిల్ 17 : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మహాత్మా జ్యోతిబాపూలే, డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించకుండా బడుగు బలహీన వర్గాల మహనీయులను యూనివర్సిటీ వీసీ అవమానించడాన్ని ఖండిస్తూ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మహనీయుల జయంతి వేడుకలను సమర్ధవంతంగా నిర్వహించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా యూనివర్సిటీ హాస్టల్స్ లో గత మూడు నెలలుగా కొనసాగుతున్న నీటి కొరతను తీర్చాలని, మెస్ బిల్లులు సమయానికి చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు సరుకులు సరైన సమయానికి అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఇతర సమస్యలపైన యూనివర్సిటీ అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినప్పటికీ, వర్సిటీ యాజమాన్యం స్పందించకపోవడం పట్ల తీవ్ర అసహనంతో యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు SSU, PDSU, MSF, SFI ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీ అన్ని కళాశాలలకు బంద్ పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనుముల సురేష్ స్వేరో, యూనివర్సిటీ ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడు మాచర్ల సుధీర్ మాదిగ, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు కర్రెమ్ రవి, పీడీఎస్యూ అధ్యక్షుడు హర్ష, అఖిల్, శరత్, భార్గవ్, సిద్దు, చందు, మురళి, జీవన్, విద్యార్థులు పాల్గొన్నారు.