యాదగిరిగుట్ట, మార్చి5 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి అనుబంధమైన పర్వతవర్ధినీ రామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో తొలిరోజు ఉదయం 11.30 గంటలకు స్వస్తివాచనంతో శ్రీకారం చుట్టారు. స్వస్తివాచనంతో లోకంలోని సర్వవిఘ్నాలు, సర్వవిధ దోషాలు తొలగి ఈశ్వర అనుగ్రహం కలుగాలని, శైవాగమ సంప్రదాయ రీతిలో ఈ వేడుకను జరిపించారు.
అనంతరం విఘ్వేశ్వర ఆరాధన చేశారు. వేదమంత్ర పఠనంతో పవిత్ర జలం, పూజ ద్రవ్యాలను ఆలయ పరిసర ప్రాంతంలో ప్రోక్షణ గావించి శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమం చేపట్టారు. ఉత్సవాలు పరమేశ్వర అనుగ్రహంతో సక్రమంగా నిర్వహింపబడాలని శాస్ర్తోక్తంగా రక్ష బంధనాలు , పూజాధికాలు నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈఓ రామకృష్ణారావు, భక్తులకు రక్షబంధనాలను యాజ్ఞికులు, ఆలయ అర్చకులు ధరింపజేశారు.
ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం పారాయణికులు నమక, చమక పారాయణాలు, మంత్రపుష్ప పఠనం, అంకురారోపణం, సోమకుంభ, కలశస్థాపన, దేవతారాధన పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ దోర్బల భాస్కర్శర్మ, ఏఈఓలు రమేశ్ బాబు, శ్రవణ్కుమార్, ప్రధాన పురోహితులు సత్యనారాయణ శర్మ, శివాలయ ప్రధానార్చకులు నరసింహరాముల శర్మ, ఆలయ అధికారులు చంద్రమౌళి పాల్గొన్నారు.
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామలింగేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ధ్వజ పటారోహణం, భేరీ పూజ, దేవతాహ్వానం, అగ్ని ప్రతిష్ఠ వంటి పూజలు నిర్వహించనున్నారు.