రామగిరి, సెప్టెంబర్ 21 : ప్రభుత్వ విద్యా విధానం బలోపేతానికి చర్యలు చేపడుతున్న రాష్ట్ర సర్కారు.. పాఠశాల విద్యార్థులకు బలవర్ధకమైన పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నది. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతి రోజు రాగి జావ, ఉడికించిన కోడిగుడ్డు అందిస్తూ విద్యా ప్రమాణాలను పెంపొందిస్తున్నది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం మరో పథకానికి శ్రీకారం చుట్టారు. 10వ తరగతిలోపు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సీఎం అల్పాహారం అందించనున్నారు. దసరా నుంచి ఈ పథకాన్ని అందించనున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింతగా పెరుగనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సన్న బియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్న రాష్ట్ర సర్కారు.. ఉదయం అల్పాహారం పెట్టాలని నిర్ణయించింది. బడికి వచ్చే పేద విద్యార్థులు ఆకలితో ఉండొద్దనే ఉద్దేశంతో ఇప్పటికే ఉదయం ప్రార్థనకు ముందు రాగి జావ, ఉడికించిన గుడ్డు అందిస్తున్నది. తాజాగా ప్రవేశపెట్టిన సీఎం అల్పాహారంలో భాగంగా సంక్షేమ హాస్టళ్ల వలే కిచిడీ, పొంగల్, ఉప్మాను చట్నీ, సాంబార్తో పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దసరా నుంచి అమల్లోకి రానున్న ఈ పథకంతో ఉమ్మడి జిల్లాలో 2,859 పాఠశాలల్లోని 2లక్షలకు పైగా విద్యార్థులకు ప్రయోజనం కలుగనున్నది. సర్కారు నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థ్ధి, ఉపాధ్యాయ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2 లక్షలకుపైగా విద్యార్థులకు ప్రయోజనం
సర్కార్ బడికి వచ్చే విద్యార్థుల్లో 90శాతానికి పైగా పేద విద్యార్థులే. వారికి ఇంటి వద్ద సరైన పోషకాహారం లభించక అనారోగ్యాల పాలవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో సంపూర్ణ పౌష్టికాహారం అందనుంది. తాజా పథకంతో ఉమ్మడి జిల్లాలోని 2,859 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2,04,109 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నది. నల్లగొండ జిల్లాలో 1,285 పాఠశాలల్లో 1,07,984 మంది, సూర్యాపేటలోని 834 పాఠశాలల్లో 52,487 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 674 పాఠశాలల్లో 43,638 మంది విద్యార్థులకు ఉదయం టిఫిన్ అందించనున్నారు.
చాలా సంతోషంగా ఉన్నది
ఇంతకుముందు మా పిల్లలను నల్లగొండలో ప్రైవేట్ స్కూల్కు పంపించా. పోయిన ఏడాది మా ఊరి సర్కారు బడిలో ఇంగ్లీష్ మీడియం చెప్తుంటే ఇక్కడికి తోలాను. మా పిల్లలు బాగా చదువుతున్నారు. సర్కార్ బడికి వచ్చే పిల్లలకు దసరా నుంచి పొద్దటి పూట టిఫిన్ పెడుతారని చెప్పడం చాలా సంతోషంగా ఉన్నది. మధ్యాహ్న భోజనం, ఇప్పుడు టిఫిన్ పెడుతూ పైసా ఖర్చు లేకుండా పిల్లలను చదివించే అవకాశం రావడం సంతోషకరం.
– పర్వతం రాములు, విద్యార్థి తండ్రి, కతాల్గూడ, నల్లగొండ మండలం
పేద విద్యార్థులకు ఎంతో మేలు
ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులంతా దాదాపు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదవారే. ఉదయం ఏమీ తినకుండా బడికి వచ్చే పిల్లలు చాలా మంది ఉన్నారు. విద్యార్థుల ఆకలి బాధను గుర్తించిన సీఎం కేసీఆర్ తండ్రిలా సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఇప్పుడు అల్పాహారం పెట్టాలని నిర్ణయించడం సంతోషకరం. ఇక విద్యార్థులు కడుపు నిండా తిని మంచిగా చదువుకునే వీలుంటుంది.
– కాలం నారాయణరెడ్డి, పీఆర్టీయూ (టీఎస్), నల్లగొండ
ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తాం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర సర్కారు ఇప్పటికే ఉదయం రాగి జావ, ఉడికించిన కోడి గుడ్డు అందిస్తున్నది. దీనిని యథాతదంగానే ఇస్తూ ఉదయం అల్పాహారం పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తజిల్లా విద్యాశాఖకు ఆదేశాలు రాగానే వెంటనే పటిష్టంగా అమలు చేస్తాం. విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలి.
– బి.భిక్షపతి, నల్లగొండ డీఈఓ