Insurance | మిర్యాలగూడ, ఏప్రిల్ 28 : గ్యాస్ సిలిండర్ పేలుడు దుర్ఘటనలు చోటు చేసుకున్న సమయంలో బాధితుల కుటుంబాలకు అండగా ఉండేలా ఆయిల్ కంపెనీలు ప్రమాద తీవ్రతను బట్టి బీమా పరిహారం అందిస్తున్నాయి. అయితే.. ఇందుకు ప్రతి ఐదేండ్లకోసారి వినియోగదారుడి గ్యాస్ సిలిండర్, రెగ్యులేటర్, పైపు తనిఖీ చేయాలని తప్పనిసరి నిబంధన విధించారు.
ఆయిల్ కంపెనీలు ‘పబ్లిక్ లయబిలిటీ పాలసీ ఫర్ ఆయిల్ ఇండస్ట్రీస్’ పేరుతో గరిష్ఠంగా రూ.50 లక్షల ప్రమాద బీమా పథకాన్ని ఎల్పీజీ వినియోగదారులకు అందిస్తున్నాయి. ఈ పథకంలో గ్యాస్ వినియోగదారులందరి పేరుతో సామూహిక బీమా చేసి ప్రమాద ఘటనలు జరిగిన సమయంలో తీవ్రతను బట్టి ఇన్సూరెన్స్ అందేలా ఏర్పాటు చేశాయి. ఈ పథకం పొందేందుకు మానవ తప్పిదాలు లేకుండా ఉండేలా ప్రతి ఐదేండ్లకోసారి గ్యాస్ వినియోగదారులు తనిఖీ తప్పనిసరిగా చేయించుకోవాలని నిబంధన తీసుకొచ్చాయి.
తనిఖీ చేసేవి..
వినియోగదారుడి చిరునామా ప్రకారం గ్యాస్ కనెక్షన్ పొందిన వారే వినియోగిస్తున్నారా అనే విషయం తనిఖీ చేస్తారు. రెగ్యులేటర్, ట్యూబ్ వ్యాలిడిటీ, స్టవ్ బర్నర్ లోపాలు, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా స్టవ్ను అమర్చారా.. లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తారు. విద్యుత్ స్విచ్ల సమీపంలో సిలిండర్లు ఏర్పాటు చేయకుండా సూచనలు ఇస్తారు. సిలిండర్ల లీకేజీలను తనిఖీ చేస్తారు. వీటన్నింటినీ యూప్లో నమోదు చేసి రిపోర్టు చేస్తారు.
2022లో నాలుగు ప్రమాదాలకు బీమా
నల్లగొండ జిల్లా పరిధిలో నల్లగొండ, మిర్యాలగూడ, డిండి, నాంపల్లిలో నాలుగు గ్యాస్ ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణనష్టం జరుగలేదు. ఆస్తి నష్టం సంభవించింది. బీమా కంపెనీ, సంబంధిత గ్యాస్ కంపెనీ వారు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాద తీవ్రత, జరిగిన నష్టం, ఆస్తి, ప్రాణ నష్టం అంచనాలను రూపొందించారు. ప్రాణ నష్టం ఉన్నచోట గరిష్ఠంగా రూ.50 లక్షల బీమా వర్తించే అవకాశం ఉంటుంది. ఆస్తి నష్టం జరిగితే వివరాలను సేకరించి బీమా అధికారులు చేసిన ప్రతిపాదనల మేరకు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి బాధితులకు బీమా సొమ్మును చెక్కు రూపంలో అందజేస్తారు. జిల్లాలో జరిగిన నాలుగు ప్రమాదాల బాధితులకు ఆస్తి నష్టం అంచనాల మేరకు త్వరలో నష్ట పరిహారం అందుతుందని గ్యాస్ కంపెనీ అధికారులు తెలిపారు.
జిల్లాలో 8 లక్షల సిలిండర్ల వినియోగం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కంపెనీల గ్యాస్ వినియోగదారులు ప్రతి నెలా సగటున 8 లక్షలకు పైగా సిలిండర్లు వినియోగిస్తున్నారు. 3వేలకు పైగా కొత్త గ్యాస్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. అయితే.. గ్యాస్ వినియోగం పెరిగిపోతున్నప్పటికీ తప్పనిసరి తనిఖీలు మాత్రం జరుగడం లేదు. ప్రమాద ఘటనలు జరిగిన సమయంలో గ్యాస్ తనిఖీ చేసినట్లు ధ్రువీకరణ ఉంటే నష్టపరిహారం వెంటనే పొందే అవకాశం ఉంటుంది. గ్యాస్ ఏజెన్సీల వారి సమాచారం మేరకు రూ.236 చెల్లిస్తే తనిఖీలు చేయిస్తారు. గ్యాస్ పైపు, లైటర్, రెగ్యులేటర్, స్టవ్ ఐఎస్ఐ మార్కు ఉన్నవాటినే వినియోగించాలి. స్వీయ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగినా, నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ వినియోగించినా పరిహారం అందదు.
గ్యాస్ ప్రమాదం జరిగితే…
గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగితే స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. గ్యాస్ ఏజెన్సీ వారికి లిఖితపూర్వక సమాచారం ఇవ్వాలి. ఏజెన్సీ వారు కంపెనీకి, బీమా సంస్థకు తెలియజేస్తే 30 రోజుల్లో కంపెనీ విచారణ పూర్తి చేసి వినియోగదారుడికి బీమా సొమ్ము అందిస్తారు. గ్యాస్ ప్రమాదాలు జరిగిన వినియోగదారుల ఇళ్లల్లో బీమా కంపెనీ, గ్యాస్ కంపెనీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారు. ప్రమాదాలకు గల కారణాలు పరిశీలిస్తారు. స్టవ్, పైపు, రెగ్యులేటర్ ఐఎస్ఐ మార్కు కలిగినవి వాడారా.. లేదా? అని పరిశీలిస్తారు. ఆకస్మికంగా జరిగిన ప్రమాదమైతే నష్ట తీవ్రతను బట్టి రూ.10వేల నుంచి రూ.50 లక్షల వరకు బీమా చెల్లిస్తారు. వినియోగదారు చనిపోతే ఒక విధంగా, కేవలం ఆస్తి నష్టం జరిగితే అంచనాల ప్రకారం పరిహారాన్ని అందిస్తారు. మృతి చెందిన ఘటనల్లో వ్యక్తి వయస్సు ఆధారంగా పరిహారం అందించే ఏర్పాటు చేస్తారు. మృతుడి పోస్టుమార్టం కాపీ, కేసు వివరాలు బీమా కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. బీమా కంపెనీ నిపుణులతో అంచనా వేసి పరిహారం అందిస్తారు.
వినియోగదారుల భద్రత కోసం తప్పనిసరి
వినియోగదారుల భద్రత కోసం ప్రతి ఐదేండ్లకోసారి కంపెనీ తరఫున ఆయా గ్యాస్ ఏజెన్సీల డీలర్లు తనిఖీలు చేస్తారు. వినియోగదారులు బయట తక్కువ ధరకు వస్తున్నాయని పైప్లు, రెగ్యులేటర్లు కొనవద్దు. గ్యాస్ డీలర్ల వద్ద నాణ్యత గల ఐఎస్ఐ మార్కు పైపులు, రెగ్యులేటర్లు తీసుకోవాలి. నిబంధనల ప్రకారం గ్యాస్ సిలిండర్లు తగిన జాగ్రత్తలతో వినియోగించేలా చూడాలనేది ప్రభుత్వం, కంపెనీల ఉద్దేశం. గ్యాస్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో భద్రత విషయంలో కూడా తనిఖీలు తప్పనిసరి చేశాం.
– యువ వశిష్ట హెచ్పీ గ్యాస్ సేల్స్ అధికారి, నల్లగొండ