నల్లగొండ, డిసెంబర్ 10: రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశ ప్రజలను ఎంతగానో ఆకర్శిస్తున్నాయని, వాటితోపాటు బీఆర్ఎస్ను ప్రజలు తప్పక ఆదరిస్తారని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. వారు శనివారం ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాలలో నిర్వహించిన ఆటో షోను వారు ప్రారంభించిన అనంతరం మీడియాతో దేశ రాజకీయాలు, బీఆర్ఎస్ ఆవిర్భావంపై మాట్లాడారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి మాట్లాడుతూ గుజరాత్ వ్యాపారులు బ్యాంకులు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయినా పట్టించుకోని ప్రధాని మోదీ నిత్యం వ్యాపారుల భజన చేస్తాడని అన్నారు. అదానీ, అంబానీ లాంటి వాళ్లను ఆదరిస్తూ సామాన్యులను పట్టించుకోవటం లేదని విమర్శించారు.
నల్లధనం తీసుకొచ్చి పేదోళ్ల ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పిన మోదీ ఇప్పటివరకు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాల ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్న ప్రజలు దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ను ఆదరిస్తారన్నారు. సీఎంను ఇబ్బంది పెట్టాలని బీజేపీ ఎన్నో కుట్రలు చేస్తున్నదన్నారు. ఈడీ,ఐటీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నట్లు ఆరోపించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నాడు తెలంగాణ వస్తేనే సంతోషంగా ఉంటామని భావించిన ప్రజలు కేసీఆర్ వెంటే ఉండటంతో నేడు పూర్తి స్థాయిలో వారికి న్యాయం జరిగిందన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసినందునే దేశ ప్రజలు ప్రస్తుతం కేసీఆర్ను నమ్ముతున్నారని ఆ విధంగానే అన్ని రాష్ర్టాల్లో బీఆర్ఎస్కు ఆదరణ ఉంటుందన్నారు.
ఇదే అభివృద్ధి దేశంలో చేయాలనే ఆలోచనతోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టారని, దాంతో బీజేపీ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా భవిష్యత్ల్లో ఢిల్లీ పీఠంపై గులాబీ జెండా ఎగరటం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.