సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 21 : రెండు ట్యాంక్బండ్లు, శిల్పారామం ఏర్పాటుతోపాటు రోడ్ల విస్తరణ.. కార్యాలయాలకు పక్కా భవనాలు.. మెడికల్ కళాశాల.. పార్కులు.. జంక్షన్లతో సూర్యాపేటను సుందరంగా తీర్చిదిద్దుకుందామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలో సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్, తుది దశ వైకుంఠధామ పనులతోపాటు నూతనంగా ఏర్పాటు చేయనున్న శిల్పారామం, అభివృద్ధి పనులను మంత్రి జగదీశ్రెడ్డి మంగళవారం సూర్యాపేట, నల్లగొండ జిల్లా కలెక్టర్లు వెంకట్రావ్, వినయ్ క్రిష్ణారెడ్డి, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్తో కలిసి సందర్శించారు.
అనంతరం వారితోపాటు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధితోపాటు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సంచలనాత్మకంగా ప్రసాదించిన సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నామన్నారు. అందులో భాగంగా కోట్లాది రూపాయలతో చేపడుతున్న అన్ని రంగాల అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీ పడేది లేదన్నారు. సూర్యాపేటలో నూతన జిల్లా కార్యాలయాలు, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మోడ్రన్ మార్కెట్, గిరిజన గురుకుల పాఠశాల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.
అలాగే రోడ్ల విస్తరణ, ఇతర అన్ని సౌకర్యాలతోపాటు జంక్షన్లు, పార్కుల ఏర్పాటుతో సూర్యాపేట రూపురేఖలు మార్చుకుందామన్నారు. ట్యాంక్బండ్లు, శిల్పారామం సూర్యాపేటకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయన్నారు. హైదరాబాద్ను తలపించేలా సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్లో బోటింగ్ ఏర్పాటు చేసుకుని మరింత ఆహ్లాదాన్ని పంచుదామన్నారు. అందుకు అవసరమైన అభివృద్ధి పనులను త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.