మిర్యాలగూడ, ఫిబ్రవరి 25 : సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. పట్టణంలో శనివారం ఆయన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రూపంలో ఇప్పటి వరకు రూ.3400కోట్లు చెక్కులు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. గత పాలకుల హయాంలో పెట్టుబడికి అరిగోస పడిన రైతులకు సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం కింద రూ.65వేల కోట్లు రైతుల అకౌంట్లలో వేశారని తెలిపారు. ఏ కారణం చేతనైనా రైతు మృతి చెందితే 15రోజుల లోపు రైతు బీమా కింద రూ.5లక్షలు బాధిత కుటుంబానికి అందించి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రైతు బీమా పథకం కింద మృతిచెందిన రైతు కుటుంబాలకు ఇప్పటి వరకు రూ.5384 కోట్లు అందించినట్లు తెలిపారు. గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంతో పాఠశాలలను ఆధునీకరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమంతో 50లక్షల మందికి కంటి పరీక్షలు చేసి 16లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశారన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికి సంక్షేమ పథకాలు అందాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గత పాలకుల హయాంలో కరెం ట్ కోతలతో ఇబ్బందిపడితే ప్రస్తుత ప్రభుత్వం 24గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నదని కొనియాడారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో 90శాతం పైగా సీసీ రోడ్లు వేశామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలకు నియోజకవర్గ పరిధిలో 28 క్టస్టర్ ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుపరిపాలన అందిస్తున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. ఆర్డీఓ చెన్నయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఎంపీపీలు నూకల సరళాహనుమంతరెడ్డి, పోకల శ్రీవిద్య, జడ్పీటీసీ ఇరుగు మంగమ్మావెంకటయ్య, తాసీల్దార్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.