భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగానిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని స్వీట్లు పంచారు. పలుచోట్ల విద్యార్థులు జాతీయ జెండాలతో భారీ ర్యాలీలు తీశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, సూర్యాపేటలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జాతీయ జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారు వివరించారు. ఆ తర్వాత ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, వివిధ రంగాలకు ఆస్తులు పంపిణీ చేశారు. వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖల శకటాలను ప్రదర్శించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
– నల్లగొండ, ఆగస్టు 15
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. మంగళవారం వాడవాడలా స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలను ఎగురవేసి సెల్యూట్ చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల సేవలను కొనియాడారు. వేడుకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లా కేంద్రాల్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలు ఆకట్టుకున్నాయి.
సబ్బండ వర్గాల సంక్షేమమే సర్కారు లక్ష్యం
‘సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నది. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తొమ్మిదేండ్లలో గణనీయమైన మార్పు సాధించాం. నాటి మహనీయలు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగుతున్నది. అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక రూపంలో ప్రయోజనం చేకూరుతున్నది. ఆర్టీసీ, వీఆర్ఏ, జేపీఎస్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో ఆయా వర్గాల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. గృహలక్ష్మి, బీసీలు, మైనారిటీలకు లక్ష రూపాయల సాయం పేదలకు మేలు చేసే పథకాలు’.
– నల్లగొండ పరేడ్ గ్రౌండ్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి