మిర్యాలగూడ, ఫిబ్రవరి 27 : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టులో బోరుబావుల ఆధారంగా వేసిన వరి పొలాలు నీరు లేక ఎండిపోతున్నాయని, ఎడమకాల్వకు రెండు వారాలపాటు నీటిని వదిలి పంటలను కాపాడాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి కోరారు. మిర్యాలగూడలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సుమారు లక్ష ఎకరాలకుపైగా వరి పొలాలను బోరుబావుల ఆధారంగా రైతులు సాగు చేశారని, వీటిలో ఈ పాటికి 20శాతం పొలాలు ఎండిపోయాయని అన్నారు. చాలా వరకు పొలాలు పొట్ట దశలో ఉన్నాయని, జిల్లా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్యమంత్రితో మాట్లాడి రెండు వారాలపాటు నీటిని వదిలేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఎడమకాల్వకు సాగునీటిని వదిలితే సుమారు లక్ష ఎకరాల పంటలు చేతికొస్తాయని తెలిపారు. ఇటీవల ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ను నింపేందుకు రెండు వారాలపాటు నీటిని తీసుకెళ్లారని, అదే సమయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మేజర్ల ద్వారా నీటిని వదిలి ఆయకట్టు పరిధిలో ఉన్న చెరవులను నింపినట్లయితే సాగు, తాగునీటి కొరత తీరుతుందని చెప్పారు.
నల్లగొండ జిల్లాలో 5.45వేల మందికి రైతుబంధు రావాల్సి ఉండగా 3లక్షల మందికే ఇప్పటివరకు ఇచ్చారని అన్నారు. మిగిలిన వారికి రైతు బంధు ఇచ్చే విషయంపై మంత్రులు, ముఖ్యమంత్రి తలా ఒక మాట మాట్లాడుతున్నారని, అందరికీ రైతుబంధు అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు రూ.15వేల రైతు భరోసా అందించాలని కోరారు.