– రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి శివరామ ప్రసాద్
హుజూర్నగర్, ఏప్రిల్ 24 : హుజూర్నగర్ ఇన్చార్జి రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తిగా శివరామ ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టులో పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదుల సహకారం చాలా అవసరమని అందుకు న్యాయవాదులు సహకరించాలని కోరారు. న్యాయవాదులకు కోర్టులో ఎలాంటి సమస్య ఏర్పడినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. న్యాయ పీఠానికి న్యాయవాదులకు మధ్య సత్సబంధాలు ఉండాలని అందుకు హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ సభ్యులు సహకరిస్తారనే ఆశాభావాన్ని అయన వ్యక్తం చేశారు. న్యాయవాదుల సహకారంతో కక్షిదారులకు సత్వర న్యాయాన్ని అందించడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
మొదట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నారపరాజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు జిల్లా అదనపు న్యాయమూర్తిని ఆయన చాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కోర్టు ప్రాంగణం నిశితంగా పరిశీలించారు. కోర్టు ప్రాంగణ పరిశుభ్రత పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ వి రమణారెడ్డి, న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, వీజీకే మూర్తి, జక్కుల నాగేశ్వరరావు, మీసాల అంజయ్య, కొట్టు సురేష్, దూలిపాల శ్రీనివాసరావు, యాదగిరి, ఏజీపీలు సురేష్ నాయక్, రేణుకా దేవి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బొబ్బ కోటిరెడ్డి, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.