కోదాడ, మార్చి 21 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తే పార్టీ తిరుగు లేని శక్తిగా ఎదుగుతుందని ఆత్మీయ సమ్మేళనాల జిల్లా ఇన్చార్జి, రోడ్లు, భవనాల కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ అన్నారు. కోదాడలోని గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విసృత్త స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిశానిర్దేశం మేరకు ఏప్రిల్ 20 నుంచి 25వరకు నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయబావుట ఎగురవేసేందుకే సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 65లక్షల సభ్యత్వంతో రాష్ట్రంలో మూడో వంతు ఓటర్లు నమోదైనా అప్రమత్తతో సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతున్నదని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా పథకాలను ఐక్యరాజ్య సమితి ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి ప్రజలను పార్టీ వైపునకు తిప్పుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి చేస్తున్న దుశ్చర్యలు, వివక్షతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దామాషా ప్రకారం రాష్ర్టానికి విడుదల కావాల్సిన నిధులు మంజూరు చేయకుండా చూపిస్తున్న సవతి తల్లి ప్రేమను ప్రజలకు వివరించాలన్నారు. 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించడంతోపాటు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ను 50వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ నిత్యం ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరిస్తూ వారి మన్ననలు పొందితే తిరిగి మరోసారి పదవులు లభిస్తాయన్నారు. సమష్టి కృషితో నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదిగి మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు శ్రేణులు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పార్టీ పనితీరు, ఆత్మీయ సమేళనాల విజయవంతానికి చేశారు. ఎమ్మెల్యే అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో నడిగూడెం, కోదాడ ఎంపీపీలు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.