యాదగిరిగుట్ట, జూలై 31 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవ సేవను అర్చకులు వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో కల్యాణమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేసి సేవను కొనసాగించారు. తూర్పునకు అభీష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. సుమారు గంటన్నరపాటు సాగిన వేడుకల్లో భక్తులు పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు. స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలు తెల్లవారుజామునే ప్రారంభమయ్యాయి. ఉదయం 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవలో స్వామివారిని మెల్కొలిపారు. తిరువారాధన జరిపి స్వామి, అమ్మవార్లకు బాలభోగం జరిపారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు.
సాయంత్రం స్వామి, అమ్మవార్లను గరుఢ, తిరుచ్చీ వాహనాలపై వేంచేపు చేసి ఆలయ మాఢవీధుల్లో సేవను ఊరేగించారు. రాత్రి దర్బార్ సేవ, నివేదన, శయనోత్సవం నిర్వహించారు. రామలింగేశ్వరాలయంలో స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నరపాటు జరిపారు. సాయంత్రం రామలింగేశ్వరుడి సేవను శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 12 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.20,51,854 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. వర్షాభావంతో పలు ప్రాంతాల్లో నెలకొన్న లీకేజీలను వైటీడీఏ టెక్నికల్ కమిటీ సభ్యులు కొండల్రావు.. ఆర్అండ్బీ ఎస్ఈ వసంతనాయక్, ఈఈ వెంకటేశ్వర్రెడ్డితో కలిసి పరిశీలించారు. లడ్డూ ప్రసాద భవనంలోకి నీళ్లు వస్తున్నాయని గమనించిన ఆయన వెంటనే పునరుద్ధరించాలని సూచించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించే సంస్కృత విద్యాపీఠంలో ముగ్గురు ఉపాధ్యాయులను తాత్కాలిక పద్ధతిన ఎంపిక చేసిన్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత వెల్లడించారు. న్యూఢిల్లీకి చెందిన కేంద్ర సంస్కృత విశ్వ విద్యాలయం ఆమోదం మేరకు ఫిబ్రవరి 28న మంజూరైన మూడు పోస్టులకు పలువురు దరఖాస్తు చేసుకోగా, ప్యానెల్ సభ్యులు సోమవారం నిర్వహించిన మౌఖిక పరీక్షల్లో సుభాశ్ చంద్రబోస్, ఎస్.నరసింహారెడ్డి, ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా కె.భారతి ఎంపికైనట్లు తెలిపారు.