నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : వ్యక్తిగత ప్రయోజనాల కోసం మునుగోడు ఉప ఎన్నికకు కారణమై తీవ్రంగా భంగపడ్డ బీజేపీ నేతకోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడిందా? బీజేపీలో గెలుపు కష్టమని భావిస్తున్నారా? తిరిగి కాంగ్రెస్లోకి వెళ్లక తప్పదని ఆలోచిస్తున్నారా? వెళ్దామనుకుంటే, రేవంత్రెడ్డి టికెట్ రానిస్తారా? వంటి సందేహాలు రాజగోపాల్రెడ్డిని వెంటాడుతున్నాయి. దాంతోఆయన ఎటూ తేల్చుకోలేక పోతున్నట్లు నల్లగొండ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నది.కాంగ్రెస్ పార్టీతోనే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజకీయంగా ఎదిగి పదవులు అనుభవించిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన ఆర్ధిక ప్రయోజనాలకు కేంద్రంలోని మోడీ సర్కార్ తోడ్పాటు అవసరమైన గెలిచిన కొద్దికాలం నుంచే బీజేపీ పల్లవి అందుకున్నారు.
కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ సీఎం కేసీఆర్ను ఓడించడం బీజేపీతోనే అవుతుందంటూ బీరాలు పలికారు. చివరకు బీజేపీ పెద్దల ఆదేశం మేరకు మునుగోడులో ఉప ఎన్నికకు కారణమయ్యారు. తన కాంట్రాక్టుల కోసం పార్టీ మారి ఉప ఎన్నిక తెచ్చిపెట్టిన రాజగోపాల్రెడ్డికి మునుగోడు ప్రజలు చెంప పెట్టులాంటి తీర్పునిచ్చారు. సీఎం కేసీఆర్తోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమంటూ బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించుకున్నారు. దాంతో రాజగోపాల్రెడ్డి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలన్నది పాలుపోని పరిస్థితి.
ఉప ఎన్నికల్లో ఆయన మాటలు నమ్మి కాంగ్రెస్ను వదిలి బీజేపీలోకి వచ్చిన కీలకమైన ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రస్తుతం ముఖం చాటేస్తున్నది. ఆయన ప్రయోజనాల కోసం తమ రాజకీయ జీవితాలను ఆగం చేస్తున్నారన్న అంతర్మథనంలో పడింది. తిరిగి బీజేపీ నుంచి రాజగోపాల్రెడ్డి పోటీ చేయవచ్చు, కానీ తాము ఆ తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అంటే అడ్రెస్ లేకుండా పోతామన్న భయంలో స్థానిక నేతలు ఉన్నట్లు సమాచారం.
దాంతో వారంతా మరోసారి రాజగోపాల్రెడ్డి వెంట నడించేందుకు ససేమిరా అంటున్నట్లు చర్చ జరుగుతున్నది. ఇదే సమయంలో తాను బీజేపీలో ఉంటే కనీస పోటీలో కూడా ఉంటానో, లేదోనన్న భయం రాజగోపాల్రెడ్డిని వెంటాడుతున్నట్లు తెలుస్తున్నది. బీజేపీ నుంచి బరిలోకి దిగితే మూడో స్థానం తప్పదని ఆయన అనుచరులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. దాంతో మునుగోడు బరిలో ఏ పార్టీ నుంచే దిగితే విజయావకాశాలు ఉంటాయన్న దానిపై రాజగోపాల్రెడ్డి దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ నడుస్తున్నది. అయితే ముందే కాంగ్రెస్ పార్టీలోకి పోతే టికెట్ గ్యారంటీ ఏమీ లేదు. పీసీసీ ఛీప్ రేవంత్రెడ్డిని రాజగోపాల్రెడ్డి ఇన్నాళ్లు అడ్డగోలుగా తిట్టిపోసారు.
కాంగ్రెస్లో వలస నేతల పెత్తనం ఏంటంటూనే, ఆయన నాయకత్వంలో ఏలా పని చేస్తారంటూ బీజేపీలోకి మారిన సమయంలో ప్రశ్నించారు. రేవంత్రెడ్డి దొంగ, డబ్బులు పెట్టి పదవి కొనుకున్నాడంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లోకి వెళ్లినా తనకు టికెట్ రానిస్తారా అన్న సంశయంలో రాజగోపాల్రెడ్డి కొట్టుమిట్టాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాక కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కుదిరినా తనకు నష్టమన్న భావనలో ఉన్నారు. పొత్తు తేలకముందు కాంగ్రెస్లో చేరితే రేవంత్రెడ్డి ఉద్దేశపూర్వకంగానే తనకు టికెట్ రాకుండా మునుగోడును సీపీఐకి కేటాయించవచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఇదే జరిగితే, రాజగోపాల్రెడ్డికి మొండిచెయ్యి తప్పదు. ఈ క్రమంలో కాంగ్రెస్, సీపీఐ పొత్తుపై ఆరా తీసే పనిలో ఉన్నారు.
సీపీఐతో పొత్తు లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్లేందుకే సిద్ధమన్న సంకేతాలు ఇస్తున్నారు. ఒకవేళ పొత్తులో భాగంగా సీపీఐకే మునుగోడును కేటాయిస్తే తాను బీజేపీ నుంచే బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు తెలిసింది. సీపీఐకి టికెట్ కేటాయిస్తే సీపీఐ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ ఓట్లు బదలాయింపు కావని, వాటిని తనకు అనుకూలంగా మల్చుకుంటే బీఆర్ఎస్తో తలపడవచ్చని భావిస్తున్నారు.
ఎలాగైనా మునుగోడులో విజయావకాశాలను బట్టే రాజకీయ భవిష్యత్ను నిర్ణయించుకునే ధోరణితో రాజగోపాల్రెడ్డి ఉన్నారన్నది స్పష్టం. ఇన్నాళ్లు మోడీ ప్రభుత్వంపై పొగడ్తలు, కాంగ్రెస్ పార్టీపై అభాండాలు వేస్తూ వచ్చిన రాజగోపాల్రెడ్డికి ఇక ముందు వాటిని పక్కన పెట్టక తప్పేలా లేదు. తన పదవీ కాంక్ష, వ్యక్తిగత అవసరాల కోసం మళ్లీ ఏ పార్టీ పాటైనా పొడొచ్చన్నది రాజకీయ పరిశీలకులు అంచనా. వాళ్ల అవసరాలే ప్రజలందరి అవసరాలుగా చిత్రీకరించడంలో కోమటిరెడ్డి బ్రదర్స్కు వెన్నతో పెట్టిన విద్య అన్నది ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు తెలిసిందే!