భువనగిరి కాంగ్రెస్ ఎంపీ సీటు కొత్త తలనొప్పిని తెచ్చి పెడుతున్నది. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య అభ్యర్థి చిచ్చు పెడుతున్నది. సీటు కోసం స్వయంగా అన్నదమ్ముల మధ్య అంతర్గత వార్ నడుస్తున్నది. తమ వారి కంటే తమ వారికి ఇవ్వాలని ఎవరికి వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. దీంతో కేడర్లో అయోమయం నెలకొంది. కాగా కొన్ని రోజులుగా అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదని ప్రచారం కూడా జరుగుతున్నది. మరోవైపు ఫ్యామిలీ పాలిటిక్స్పై భువనగిరి ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల కావడంతో రాకీయాల్లో వేడి రాజుకున్నది. ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని నల్లగొండ పార్లమెంట్కు కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ ఖరారు చేసింది. అయితే భువనగిరి అభ్యర్థి ఇంకా ఫైనల్ చేయలేదు. ఇప్పటికే ఉన్న నేతలతోపాటు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎవరికి వారు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూతురు కీర్తి రెడ్డి పోటీకి దరఖాస్తు చేసుకొని ప్రయత్నాలు చేస్తున్నారు.
భువనగిరి సీటు తమ వారికి దక్కించుకునేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరికి వారే వేర్వేరుగా లాబీ చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల వరకు భువనగిరి ఎంపీగా కొనసాగారు. ఎమ్మెల్యేగా గెలువడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. భువనగిరిలో ఆయన ప్రత్యేకంగా వర్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయన రాష్ట్రమంత్రి వర్గంలో కీలకంగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి తన పట్టు నిలుపుకొనేందుకు తనవారికే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇందుకోసం తన అన్న కొడుకు అయిన సూర్యపవన్ రెడ్డికి ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల సూర్యపవన్ రెడ్డిని వెంటబెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం తన వారి కోసం భువనగిరి ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు. ఇటీవల హోంమంత్రి పదవిపై తన మససులోని మాట చెప్పారు. అయితే ఇప్పటికే అన్న వెంకట్ రెడ్డి మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కేబినెట్ స్థానంపై క్లారిటీ రాలేదు. గతంలో భువనగిరి ఎంపీగా పనిచేసిన రాజగోపాల్ రెడ్డికి తనకంటూ ఓ కేడర్ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య లక్ష్మిని భువనగిరిలో నిలుపాలని భావిస్తున్నారు. తన భార్యకు సీటు ఇవ్వాలని గట్టిగానే పట్టుబడుతున్నారు.
కోమటిరెడ్డి ఫ్యామిలీ పాలిటిక్స్పై జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వెంకట్ రెడ్డి మంత్రిగా, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే రాజకీయాల్లో కీలకంగా ఉన్నారని, మళ్లీ కుటుంబ సభ్యులను తెరపైకి తేవడం ఏంటని ప్రజలు పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్లో ఒక కుటుంబంలో ఒకటే టికెట్ నినాదం తుంగలో తొక్కారని, అధిష్టానం నిర్ణయాన్నే కనీసం పాటించే పరిస్థితి లేదని విమర్శిస్తున్నారు. కాగా నేడో, రేపో టికెట్ ప్రకటించే అవకాశం ఉందని, అభ్యర్థిత్వం ఎవరికి వరిస్తుందో వేచి చూడాల్సిందే.
కోమటిరెడ్డి బ్రదర్స్ వేర్వేరుగా ఇద్దరి పేర్లను ప్రతిపాదిస్తుండగా, సీఎం రేవంత్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డికి అండగా నిలుస్తున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సైతం తన కూతురుకు ఇవ్వాలని అడుగుతున్నారు. దీంతో కేడర్లో అయోమయం నెలకొన్నది. భువనగిరి అభ్యర్థుల ఖరారుపై ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు వీరిలో ఏ ఒక్కరికి సీటు ఖరారు చేసినా మిగతా ఆశావహులు సపోర్ట్ చేస్తారనే నమ్మకం లేదు. ఆయా నేతల కేడర్ సైలెంట్గా ఉండే అవకాశం లేకపోలేదు.