కోదాడ రూరల్, జూలై 18 : బస్సులో తరలిస్తున్న 10 కిలోల గంజాయిని సోమవారం తెల్లవారుజామున పట్టణ పోలీసు పట్టుకున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పట్టణ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన తాడి మహేశ్ ఇంటర్ చదువుతున్నాడు. గంజాయికి బానిసగా మారిన మహేశ్ హైదరాబాద్లో గంజాయి దొరక్క పోవడంతో విశాఖపట్నం జిల్లా పాడేరులో తనకు తెలిసిన వారి వద్ద నుంచి 10 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు.
ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు బయల్దేరాడు. కోదాడ పట్టణ శివారులోని దుర్గాపురం క్రాస్రోడ్డు వద్ద పట్టణ పోలీసులు వాహనాల తనిఖీలో నిర్వహిస్తున్న విషయాన్ని గమనించి గంజాయి బ్యాగులతో బస్సుదిగి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు వెంబడించి పట్టుకున్నాడు. అతడి వద్ద నుంచి 10 కిలోల గంజాయి, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మహేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, పట్టణ సీఐ నరసింహారావు, ఎస్ఐలు ఎస్.రాంబాబు, ఎం. నాగభూషణంను ఎస్పీ అభినందించారు.
నాగారం వద్ద రెండు కిలోలు
నాగారం : గంజాయిని రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు స్ఐ అంజిరెడ్డి తెలిపారు. మండల కేంద్రం మీదుగా గంజాయి రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో తుని నుంచి కాజీపేటకు వెళ్తున్న వరంగల్ జిల్లా కాజీపేటకు చెందని సంజీవ్ రూపాని, శ్రీనివాస్లును అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహించారు. వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.