‘నేను మీ వాడిని.. మీలో ఒకడిని.. సొంత గడ్డపై మమకారం ఉన్నవాడికే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తపన ఉంటుంది. 15 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలతో మమేకమై మంచి, చెడు, కష్ట సుఖాల్లో ఓ బిడ్డలా పాలు పంచుకున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం, ప్రజల అండతో గెలిచి అభివృద్ధిలో భాగస్వాముడినయ్యా. నాలుగున్నరేండ్లలో నియోజకవర్గంలో రూ.1,960 కోట్ల పనులు చేపట్టాం. సాగర్తోపాటు కాళేశ్వరం నీళ్ల రాకతో పంటలు పుష్కలంగా పండుతున్నాయి. నమ్మకంతో సీటు ఇచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. మరోసారి సరిహద్దులో గులాబీ జెండా ఎగురు వేస్తాం’ అని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.
– కోదాడ, ఆగస్టు 24
ఇవ్వని హామీలు ఏమైనా నెరవేర్చారా..?
ఎమ్మెల్యే : గత ఎన్నికల ఎజెండాలో లేని ఎన్నో హామీలను నెరవేర్చాను. కోదాడలోని 30 పడకల ప్రభుత్వ దవాఖానను వంద పడకల దవాఖానగా మార్చాం. అదే దవాఖానలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాం. పల్లె దవాఖానలు పెంచాం. డ్రైనేజీల నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు సంబంధించిన హామీలను నెరవేర్చాను.
చివరి భూముల సాగు నీటికి తీసుకున్న చర్యలు ?
ఎమ్మెల్యే : సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు చివరిలో ఉన్న నియోజకవర్గం కోదాడ. గత పాలకుల హయాంలో సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలైన నీళ్లు చివరి భూములకు అందలేదు. దాంతో రైతులు అప్పుల పాలైన పరిస్థితి. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సాగర్ నుంచి రెండు పంటలకు నీరు అందడంతో ఇక్కడి రైతులు రెండు కార్లు పండించుకున్నారు. నియోజకవర్గంలోని మోతె, నడిగూడెం, మునగాలలోని 15 వేల ఎకరాలకుపైగా కాళేశ్వరం జలాలతో సస్యశామలం అవుతున్నాయి.
విపక్షాల పరిస్థితి ఎలా ఉంది ?
ఎమ్మెల్యే : ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో ప్రతిపక్షాల చిరునామాలు గల్లంతయ్యాయని చెప్పుకోవాలి. ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో కుటుంబ సభ్యులు ఆర్థిక లబ్ధి పొందుతున్న వారే ఉన్నారు. బీఆర్ఎస్ కాక మరే ఏ పార్టీ అయినా గెలిస్తే సంక్షేమ పథకాలను తొలగిస్తారేమోనని భయం ప్రజల్లో ఉంది. అందుకే బీఆర్ఎస్కు ప్రజలు, లబ్ధిదారులు వెన్నుదన్నుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడే ముఖ్యమంత్రి అవ్వడంతో మా బాధలు తెలుసు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అందుకే మరోసారి ఇక్కడ గులాబీ జెండాను ఎగురవేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
సంక్షేమ పథకాల పంపిణీ ఎలా ఉన్నది?
ఎమ్మెల్యే : ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ ఫలాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగాల్సిన పనిలేకుండా చేస్తున్నాం. నేరుగా నేనే వారి ఇండ్ల ముంగిటకు వెళ్లి అందజేస్తున్నాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ తదితర ఫలాలను లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి ఇస్తున్నాం. దాంతో వారి క్షేమ సమాచారాలను తెలుసుకొని ముందుకు సాగుతున్నా. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు నన్ను మరోసారి గెలువాలని ఆశీర్వదిస్తున్నారు.
నియోజకవర్గ ప్రజలకు మీ అప్పీల్ ?
ఎమ్మెల్యే : ఈ నియోజకవర్గ బిడ్డను. ఇక్కడే పుట్టాను.. నా తుది శ్వాస కూడా ఇక్కడే…సొంత గడ్డపై మమకారం ఉన్నవాడికే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తపన ఉంటుంది. 15 సంవత్సరాలుగా మీతో మమేకమై మంచి, చెడు, కష్ట సుఖాల్లో ఓ బిడ్డలా పాలు పంచుకున్నా.. అవకాశం ఉన్నంత మేరకు ఇతోధికంగా సహాయ పడ్డాను. ప్రతిఫలంగా తొలి విడుతనే నన్ను గెలిపించారు. మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై నమ్మకంతో మీ ప్రతినిధిగా టికెట్ ఖరారు చేశారు. ఆశీర్వదించి అక్కున చేర్చుకుని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా.
రెండోసారి ఎమ్మెల్యే టికెట్ ఖరారు పై మీ స్పందన ?
ఎమ్మెల్యే : నాపై ప్రగాఢ విశ్వాసంతో రెండోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ ఖరారు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటా. నియోజకవర్గంలో ఎక్కడో మారుమూల నడిగూడెం మండలం కరివిరాల గ్రామానికి చెందిన ఓ బీసీ బిడ్డకు పార్టీ పక్షాన అభ్యర్థితత్వం ఖరారు చేసి ఆశీర్వదించగా గెలిచాను. మరోసారి తన అభ్యర్థితత్వాన్ని ఖరారు చేయడం సంతోషంగా ఉంది. బాధ్యతతో అధినేత నేతృత్వంలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, ప్రజల ఆశీర్వాదంతో రెండోసారి గెలిచి సీఎం కేసీఆర్కు కానుకగా ఇస్తా.
టికెట్ ఖరారు చేసిన అనంతరం పార్టీ శ్రేణుల స్పందన ?
ఎమ్మెల్యే : నాకు మరోసారి టికెట్ కేటాయించడంతో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు. భారీ మెజార్టీతో గెలిపించేందుకు కంకణబద్ధులై ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది.
ఎప్పటి నుంచి ప్రచారం షురూ చేస్తారు ?
ఎమ్మెల్యే : ప్రత్యేకంగా ప్రచారం ప్రారంభించేది ఏమి లేదు. గత ఎన్నికల్లో నేను గెలిచిన తొలి రోజు నుంచి నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నాను. నియోజకవర్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా హాజరవ్వడం మామూలే. దాదాపు నియోజకవర్గంలో 70శాతం ఇండ్లల్లో జరిగిన పెండ్లి వేడుకలు, శుభకార్యాలకు నన్ను కుటుంబ సభ్యుడిలా ఆప్యాయంగా పిలువడం, నేను హాజరవ్వడం 15 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నదే.
నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం తీరు?
ఎమ్మెల్యే : నేను గెలిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో గత పాలకులు చేయని అభివృద్ధిని చేసి చూపించాను. రూ.1,950 కోట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మన ఊరు, మన బడితోపాటు పలు కార్యక్రమాలతో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధించాయి. ఆర్అండ్బీ, సీసీరోడ్లు, సాగర్ కాల్వల లైనింగ్, కోదాడ పట్టణంలో సెంట్రల్ లైటింగ్, పెద్దచెరువు వద్ద ట్యాంక్ బండ్ నిర్మాణం, పబ్లిక్ పార్కు తదితర అభివృద్ధి పనులు రికార్డు స్థాయిలో జరిగాయి.