కోదాడ, సెప్టెంబర్ 16 : ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సైతం నమ్మే పరిస్థితి లేదని, రోజు రోజుకు ఆయన ప్రజల్లో అప్రతిష్ట పాలు అవుతున్న పరిస్థితుల్లో ఫ్రస్టేషన్తో తనపై ఆరోపణలు చేస్తున్నట్లు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రాంత బిడ్డగా గెలిచినా, ఓడినా నియోజకవర్గ ప్రజల మధ్యే ఉన్నా. వారి కష్ట నష్టాల్లో కుటుంబ సభ్యుడిలా పాలుపంచుకున్నా. అందుకే అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు ఆయన తెలిపారు. శనివారం కోదాడ క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై విలేకరులతో మాట్లాడారు.
నియోజకవర్గానికి ఉత్తమ్ దంపతులు టూరిస్టులా ఆరె నెలలకోసారి వచ్చి ప్రజలకు దర్శనం ఇస్తున్న విషయం తెలిసిందేనన్నారు. ఎన్నికప్పుడు మాత్రమే మేమున్నాం అంటూ.. మాకు పిల్లలు లేరు నియోజకవర్గ ప్రజలే మాకు పిల్లలు అని కల్లబొల్లి మాటలు చెప్పడం పరిపాటి అయిందని దుయ్యబట్టారు. నమ్ముకున్న ప్రజలను నట్టేట ముంచి రాత్రికి రాత్రే కోదాడను వదిలిపెట్టి హుజూర్నగర్కు పలాయనం ఎవ్వరు చింతగించారో అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. ఇక్కడ జన్మించిన వారికే ఈ ప్రాంతంపై మమకారం ఉంటుందని, ఇతరులకు ఎందుకుంటుందని అన్నారు.
ఆయన హయాంలోనే మునగాల మండలంలో హత్య రాజకీయాలు మొదలయ్యాయని కుల, సంఘర్షణ రాజకీయాలకు తెరలేపిన చరిత్ర ఆయనదన్నారు. చివరికి నియోజకవర్గంలో వైన్స్ సిండికేట్లు, కుటుంబాలను ఆర్పే జూదపు క్లబ్లు నడిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో పట్టుమని పది మందిని కూడా గుర్తుపట్టి పలుకరించే పరిస్థితి లేని ఉత్తమ్ దంపతులు తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2018కి ముందు ప్రతిపక్షాలపై అక్రమ కేసులు ఎన్ని ? నేటి పరిస్థితి ఏమిటి ? పరిశీలిస్తే ఆయన భాగోతం బహిర్గతమౌతుందన్నారు. తన పార్టీలో చేరని ప్రజా ప్రతినిధుల చెక్పవర్ రద్దు చేయించడంతో పాటు అక్రమ కేసులు బనాయించిన చరిత్ర ఉత్తమ్ది అని ఆరోపించారు.
నిన్న, మొన్నటి వరకు తన రాజకీయ భవిష్యత్ కోసం ఎవరితో బేరసారాలు జరిపారో.. ఆ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. అధికారం కోసం ఎంతటి స్థాయికైనా దిగజారడం ఆయన నైజం అన్నారు. కోదాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సర్కార్ రూ.2,100 కోట్లకు పైగా అభివృద్ధి, సంక్షేమం కలగలిపి చేసిన పనులను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గంలోని మోతె, నడిగూడెం, మునగాల మండలాలకు కాళేశ్వరం జలాలు, 6 వేల మందికి గృహలక్ష్మి పథకం అమలు, గతంలో దళిత బంధు వంద మందికి మంజూరు చేయడంతో పాటు మరో 1,100 మందికి నెల రోజుల్లో దళిత బంధు లబ్ధి చేకూరనున్నట్లు వెల్లడించారు. ఇక వంద పడకల ప్రభుత్వ దవాఖాన, డయాలసిస్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు మండలాల్లో సమగ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. క్రమశిక్షణ గల పార్టీ శ్రేణులతో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కోదాడ నియోజకవర్గంలో రెండోసారి బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్ట్ను ఎమ్మెల్యే ఖండించారు.