కోదాడ, ఏప్రిల్ 16 : ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోదాడ పట్టణ పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన పట్టణ ఆత్మీయ సమ్మేళనం జన ప్రభంజనంగా మారింది. సుమారు 15వేలకు పైగా పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో జన జాతరను తలపించింది. వారం రోజుల నుంచి మున్సిపాలిటీ పరిధిలోని 35 వార్డుల్లో బీఆర్ఎస్ మహిళా నాయకులు ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి కరపత్రాలతో ప్రచారం నిర్వహించగా.. మండే ఎండను సైతం లెక్క చేయకండా పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
మహిళలు బతుకమ్మలతో ఉత్సాహంగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు 5గంటల పాటు నాయకుల ప్రసంగాలను ఆసక్తిగా ఆలకించారు. వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కూలర్లు పెట్టి.. మజ్జిగ, వాటర్ ప్యాకెట్లను అందజేశారు. భోజన ఏర్పాట్లు సంతృప్తిగా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కళాకారులు నిర్వహించిన ఆటాపాట ఆకట్టుకున్నది. రాష్ట్ర ప్రగతిపై ప్రముఖ బిల్డర్ పందిరి రాజశేఖర్ ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని నాయకులు వీక్షించారు. సమ్మేళనం గ్రాండ్ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం కనిపించింది.