కోదాడ, ఫిబ్రవరి 03 : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేక కోదాడ పట్టణ 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ప్రసాద్ ను కాంగ్రెస్ వారు కిడ్నాప్ చేశారని, తక్షణమే పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన ఈ అంశంపై ఎన్నికల ఇన్చార్జి బూడిద భిక్షమయ్య గౌడ్తో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో నేరుగా గెలవలేక దొడ్డి దారిన కాంగ్రెస్ నాయకులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
కిడ్నాప్ గురైన తమ పార్టీ అభ్యర్థి ప్రసాద్ను వెంటనే సురక్షితంగా విడిపించి తమకు అప్పగించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.. అధికార అహంకారంతో దౌర్జన్యానికి పాల్పడితే సహించబోమని ఆయన హెచ్చరించారు. కాగా 11వ వార్డులో స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలని, ఏకగ్రీవానికి తాము అంగీకరించమని, బలవంతంగా ఏకగ్రీవం చేయడం తగదని ఆ కాలనీ వాసులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలే తప్పా తప్పుడు విధానాలు అవలంభించి ఏకగ్రీవం చేసుకోవడాన్ని తాము ఖండిస్తున్నట్లు వార్డు ప్రజలు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు.

Kidnap : కిడ్నాప్ చేసిన ప్రసాద్ను సురక్షితంగా అప్పగించాలి : మాజీ ఎమ్మెల్యే బొల్లం