బొడ్రాయి బజార్, ఏప్రిల్ 21 : దేశంలో మరో విప్లవానికి సూర్యాపేట కేంద్రం కావాలని, దానికి తన వంతు కృషి అందిస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కవిరాజ్ 55వ వార్షిక కవి సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను సైతం కవితలు రాశానని, తన కవితలు విజృంభణలో అచ్చవడంతో విరసం మహాసభలకు తనను ఆహ్వానించినట్లు తెలిపారు. కవిత్వం, సాహిత్యం అనేవి నాటి పరిస్థితుల నుంచి పుడుతాయని, అదే ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ ఒక పోరాటానికి దారి తీస్తుందన్నారు. ఒక్కో పద్యం, పాట విప్లవాలను లేపాయని పేర్కొన్నారు. సాహిత్యం బతికి ఉన్నా.. సమాజమే చైతన్యంగా, ప్రగతిశీలంగా ఉంటుందన్నారు.
మనం మాత్రమే కవితలు రాసుకొని చదువుతున్నామని, మరో తరానికి మన కవిత్వాన్ని అందించలేకపోతున్నామని, ఆ తరాన్ని కూడా ఇక్కడ కూర్చోబెట్టి వారికి కవిత్వాన్ని ఎక్కించగలగాలని సూచించారు. కవి సమ్మేళనంలో కూర్చున్న కవులు ఎలాంటి చైతన్యాన్ని ఇచ్చారో కేవలం కొద్ది మందికి మాత్రమే తెలుసన్నారు. తెలంగాణకు మించిన కర్తవ్యం మన ముందర ఉందని, రైతంగా సాహిత్య చైతన్యానికి కేంద్రంగా సూర్యాపేట ఉండాలని ఆకాక్షించారు. అనంతరం దర్భాశయం శ్రీనివాసాచార్యకు కవిరాజ్ సాహితీ పురస్కారాన్ని అందజేసి సన్మానించారు. మనం వికాస్ వేదిక అధ్యక్షుడు పెద్దిరెడ్డి గణేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి కవిరాజ్, పాలపిట్ట ఎడిటర్ గుడిపాటి, సుధాకర్ పీవీసీ అధినేత మీలా మహదేవ్, చింతకింది శ్రీనివాస్రావు, డాక్టర్ రఘు, డాక్టర్ రాందాస్, శశిధర్, దేవులపల్లి ప్రభాకర్రావు పాల్గొన్నారు.